పొత్తులు.. ఎత్తులు!

10 Sep, 2018 02:18 IST|Sakshi

సొంతంగా పోటీ అంటూనే పొత్తు కోసం ప్రయత్నాలు

టీజేఎస్‌తో జతకట్టేందుకు బీజేపీ పావులు

సాక్షి, హైదరాబాద్‌: ‘‘మేం ఎవరితోనూ పొత్తు పెట్టుకోవడం లేదు. మా పార్టీ తరఫునే 119 స్థానాల్లో పోటీ చేస్తాం’’అని చెబుతూ వస్తున్న బీజేపీ, టీజేఎస్‌ లోలోపల మాత్రం పొత్తులపై కసరత్తు వేగవంతం చేశాయి. అమిత్‌ షా డైరెక్షన్‌లో రాష్ట్రంలో బీజేపీకి ఉన్న స్థానాలను పదిలపరుచుకోవడంతోపాటు మరిన్ని స్థానాలను దక్కించుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది. అమిత్‌ షాతో జరిగిన భేటీలోనూ కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ మినహా కలిసివచ్చే పార్టీలతోనూ మాట్లాడాలని సూచించిన నేపథ్యంలో టీజేఎస్‌తో చర్చలు జరిపినట్లు తెలిసింది.

టీజేఎస్‌కు చెందిన ఓ ముఖ్య నాయకుని ఇంట్లో ఇటీవల టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం, బీజేపీ తాజా మాజీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి సమావేశమై చర్చించినట్లు తెలిసింది. అయితే బయటకు తాము భేటీ కాలేదని చెబుతున్నా.. కోదండరాంతో కిషన్‌రెడ్డి సమావేశమై పొత్తుల అంశంపై మాట్లాడినట్లు తెలిసింది. కానీ రెండు పార్టీలు బయటకు మాత్రం తాము అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని చెబుతున్నాయి. మరోవైపు పొత్తు కోసం టీజేఎస్, కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య నేతలు పరస్పరం చర్చలు జరుపుతుండగా టీడీపీ నేతలు టీజేఎస్‌తో పొత్తు కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు.  

>
మరిన్ని వార్తలు