‘కారు స్టీరింగ్‌ మజ్లీస్‌ చేతిలో’

24 Nov, 2018 15:56 IST|Sakshi

మజ్లీస్‌ మద్దతు లేకుండా టీఆర్‌ఎస్‌ అధికారంలోకి రాదు

చంద్రబాబు స్క్రిప్టు ప్రకారమే సోనియా గాంధీ సభ

బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్‌ రావు

సాక్షి, హైదరాబాద్‌ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన స్క్రిప్టు ప్రకారం సోనియా గాంధీ మేడ్చల్‌ సభ జరిగిందని బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్‌ రావు ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో సభ పెట్టి పక్క రాష్ట్రమైన ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించడమేంటని ఆయన ప్రశ్నించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు అంత చులకనగా కనిపిస్తున్నారా? అని అన్నారు. కూటమిలో ఉన్న చంద్రబాబును ఇదివరకే ప్రజలు తిరస్కరించినందును సోనియా సభకు రాలేదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ భుజాలపైకి ఎక్కి చంద్రబాబు స్వారీ చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఎన్నికల్లో కూటమికి ఓటు వేస్తే ఓటుకున్న గౌరవం పోతుందని ఆయన అన్నారు.

టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ కుమార్‌ రెడ్డికి జీవితంలో గడ్డెం గీసుకునే యోగం లేదని ఆయన ఎద్దేవా చేశారు. కామెడీ షోలో రాహుల్‌ గాంధీ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ అని.. సోనియా గాంధీ మెయిన్‌ ఆర్టిస్ట్‌ అని పోల్చారు. రంగురంగుల కండువాలతో ఫోటోలు దిగడానికే సభను పెట్టుకున్నారని.. అందులో కోదండరాం జోకరుగా మారిపోయాడని విమర్శించారు. మజ్లీస్‌ మద్దతు లేకుండా టీఆర్‌ఎస్‌ అధికారంలోకి రాదని.. కారు స్టీరింగ్‌ తమ చేతిలో ఉందని అక్బరుద్దీన్‌ ఓవైసీ గతంలో చెప్పినట్లు ఆయన గుర్తు చేశారు.  

మరిన్ని వార్తలు