కేంద్ర రైతు పథకాలపై బీజేపీ వాల్‌పోస్టర్‌

9 Aug, 2018 02:24 IST|Sakshi
కె.లక్ష్మణ్‌

సాక్షి, హైదరాబాద్‌: కేంద్రంలోని ఎన్డీయే సర్కార్‌ ఈ నాలుగేళ్లలో రైతుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలను వివరిస్తూ బీజేపీ రాష్ట్ర శాఖ వాల్‌ పోస్టర్‌ను రూపొందించింది. మంగళవారం బీజేపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఈ నాలుగేళ్లలో ప్రధాని మోదీ ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన, భూసార పరీక్షలు వంటి వినూత్న పథకాలను ప్రవేశపెట్టారని పేర్కొన్నారు.

ఈ ఏడాది పెంచిన మద్దతు ధరల వల్ల రైతులకు ఎకరానికి రూ. 4 వేల నుంచి రూ.12 వేల వరకు లబ్ధి చేకూరుతోందని చెప్పారు. ఈ నెల 17 నుంచి 26 వరకు చేపట్టనున్న ‘మాట తప్పిన రాష్ట్ర ప్రభుత్వం– మార్పు కోసం బీజేపీ’నినాదంతో గ్రామాల్లో బైక్‌ ర్యాలీలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ ఎన్నికల హామీలు, ప్రధాని మోదీ చేపడుతున్న ప్రజాహిత కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తామన్నారు. కార్యక్రమంలో కిసాన్‌ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి నర్సింహారెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యుడు జైపాల్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌ కుమార్‌ పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు