ఉత్తమ్‌కు షాకిచ్చిన టీడీపీ నేత

16 Nov, 2018 20:54 IST|Sakshi

టీఆర్‌ఎస్‌లో చేరిన టీడీపీ నేత బొల్ల మల్లయ్య యాదవ్‌

మహాకూటమికి కోదాడలో ఎదురుదెబ్బ

సాక్షి, నల్గొండ : ఎన్నికల ముందు మహాకూటమికి ఎదురుదెబ్బ తగిలింది. కూటమిలో భాగం‍గా నల్గొండ జిల్లా కోదాడ సీటు తనకే వస్తుందని భావించిన టీడీపీ నేత బొల్ల మల్లయ్య యాదవ్‌ టికెట్‌ రాకపోవడంతో  గులాబీ గూటికి చేరారు. కోదాడ స్థానాన్ని సిట్టింగ్‌ ఎమ్మెల్యే, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి భార్య ఉత్తమ్‌ పద్మావతికి కేటాయించిన విషయం తెలిసిందే. దీంతో తీవ్ర నిరశ చెందిన ఆయన శుక్రవారం తెలంగాణ భవన్‌లో ఆపధర్మ మంత్రి కేటీఆర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. మల్లయ్య పార్టీని వీడడంతో మహాకూటిమి అభ్యర్థి ఉత్తమ్‌ పద్మావతి విజయంపై పడుతుందని అక్కడి నేతలు విశ్లేషిస్తున్నారు. 

మల్లయ్య చేరిక సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. మహాకూటమిలో మల్లయ్య యాదవ్‌కు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. ‘‘కేసీఆర్‌యే స్వయంగా ఫోన్‌ చేసి తాను బలహీన వర్గాల గొంతుకగా ఉంటానని మల్లయ్యకు భరోసా ఇచ్చారు. కేవలం పన్నెండు గంటల వ్యవధిలోనే ఇంతమంది తెలంగాణ భవన్‌కు రావడం సంతోషకరం. తెలంగాణ భవన్‌లో ప్రతి రోజు వేలాది మందితో చేరికలు జరుగుతుంటే గాంధీ భవన్‌కు మాత్రం గేట్లకు తాళాలు వేస్తున్నారు. అక్కడ బౌన్సర్లే, ఉత్తమ్‌ ఇంటి వద్ద బౌన్సర్లే. 30 ఏళ్లు కాంగ్రెస్‌లో పనిచేసిన వారి వద్ద కూడా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆ పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు. మూడు కోట్లకు టికెట్‌ అమ్ముకుంటున్న వారు పొరపాటున అధికారంలోకి వస్తే రాష్ట్రాన్నే అమేస్తారు. చంద్రబాబుకే తెలంగాణను అమ్ముకోరని గ్యారంటీ ఎంటి? వారి టికెట్లు ఢిల్లీ, అమరావతిలో ఖరారు అయ్యాయి. కాంగ్రెస్‌లో 40 మంది సీఎం అభ్యర్థులు ఉన్నారు. గత పాలనను చూడండి నాలుగేళ్ల కాలంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూడండి’’ అని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు