కుబ్రా కుటుంబానికి అండగా ఉంటాం

27 Nov, 2019 02:54 IST|Sakshi
కుబ్రా తల్లిదండ్రులతో మాట్లాడుతున్న మేయర్‌ బొంతు రామ్మోహన్‌

వైద్య ఖర్చులు భరిస్తాం

మేయర్‌ బొంతు రామ్మోహన్‌

రాయదుర్గం: బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌ ప్రమాదంలో గాయపడి గచ్చిబౌలి కేర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అనంతపురానికి చెందిన కుబ్రా కుటుంబానికి అండగా ఉంటామని జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ తెలిపారు. మంగళవారం ఆయన ఆస్పత్రికి వెళ్లి ఆమెను పరామర్శించారు. కుబ్రా తల్లిదండ్రులు అబ్దుల్‌ అజీమ్, షాహిదా, సోదరుడు అబ్దుల్‌ ఖలీద్‌లను కలిశారు. అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘కుబ్రా కుటుంబానికి జీహెచ్‌ఎంసీ అం డగా ఉంటుంది. వైద్య ఖర్చులన్నీ భరిస్తాం. ఆమె ఆరో గ్య పరిస్థితిని డిప్యూటీ, జోనల్‌ కమిషనర్‌ ఎప్పటికప్పుడు పరిశీలిస్తారు. సర్జరీ తర్వాత డిశ్చార్జీ అయ్యాక 2 నెలలు పర్యవేక్షించాల్సి ఉంటుందని డాక్టర్లు చెప్పారు. ఆ సమయంలో వారి కుటుంబానికి అండగా ఉంటాం’అని అన్నారు.

అందరికీ కృతజ్ఞతలు  
‘పెయింటింగ్‌ చేస్తూ ఎంతో కష్టపడి నా ఇద్దరు పిల్లలను చదివించాను. నా కూతురు ప్రమాదంలో గాయపడటం మమ్మల్ని కలచివేసింది. మేం పేదోళ్లం. చికిత్సకయ్యే వ్యయాన్ని భరించలేని పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వం, నగర మేయర్‌ భరోసా ఇవ్వడం సంతోషంగా ఉంది’ అని కుబ్రా తండ్రి అన్నారు. ఆదుకునేందుకు వచ్చిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.  కాగా.. కుబ్రా తల్లిదండ్రులను కడప జిల్లాకు చెందిన వైఎస్సార్‌సీపీ నేతలు మంగళవారం పరామర్శించారు. రాంభూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో మరో ఇద్దరు నేతలు హైదరాబాద్‌కు చెందిన బీబీజీ కంపెనీ ద్వారా అజీమ్‌కు ఆర్థిక సాయం చేశారు.  

>
మరిన్ని వార్తలు