ఎంపీ బూర నర్సయ్య గౌడ్
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో ఈత, తాటి పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిందని ఎంపీ బూర నర్సయ్య గౌడ్ తెలిపారు. గురువారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ నల్లగొండ జిల్లా కొండపల్లిలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించిందని తెలిపారు. ఇది గీత కార్మికులకు ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ కృషి ఫలిం చిందని చెప్పారు. గీత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, హరితహారంలో భాగంగా 5 కోట్ల ఈత చెట్లను నాటాలని లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు.
మలక్పూర్ వద్ద అండర్ పాస్ నిర్మించండి..
మలక్పూర్ ఎక్స్ రోడ్డు వద్ద వెహికల్ అండర్ పాస్ నిర్మించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని టీఆర్ఎస్ ఎంపీలు కొత్త ప్రభాకర్రెడ్డి, బీబీపాటిల్ కోరారు. అండర్పాస్ లేకపోవడం వల్ల వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోందని, దాని నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రిని కలసి వినతిపత్రాన్ని ఇచ్చారు.
బీడీ కార్మికులకోసం ఈఎస్ఐలు..
తెలంగాణలో అధిక సంఖ్యలో బీడీ కార్మికులు నివసిస్తున్న ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఈఎస్ఐ ఆస్పత్రులు నెలకొల్పాలని కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్కుమార్ గంగ్వార్ను ఎంపీ నంది ఎల్లయ్య కోరారు.