ఇటు ఫ్రెండ్లీ పోలీసింగ్ అటు సోదాలు

11 Aug, 2014 00:43 IST|Sakshi
ఇటు ఫ్రెండ్లీ పోలీసింగ్ అటు సోదాలు
  •  వీకెండ్‌లో బిజీబిజీగా గడిపిన సైబరాబాద్ పోలీసులు
  •  సాక్షి, సిటీబ్యూరో:  ఒకపక్క రాఖీ పండుగ.., మరోపక్క వీకెండ్.  అయినా సైబరాబాద్ పోలీసులు మాత్రం విధి నిర్వహణలో ఆదివారం బిజీబిజీగా గడిపారు. శంషాబాద్‌జోన్‌లో 250 మందితో ‘కార్డన్ అండ్ సర్చ్’ నిర్వహించగా, మరోపక్క ఎల్బీనగర్, బాలానగర్ జోన్ పోలీసులకు ఫ్రెండ్లీ పోలీసింగ్‌పై అవగాహన తరగతులు నిర్వహించారు. ప్రజల్లో పోలీసు ప్రతిష్టను మరింత పెంచేందుకు నడుంబిగించిన సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ .. ముందుగా తమ సిబ్బందికి ఫ్రెండ్లీ పోలీసింగ్‌పై అవగాహన కల్పించాలని నిర్ణయించారు.
     
    ఇందులో భాగంగా అన్ని ఠాణాల సిబ్బందిని ఒక్కచోట కూర్చోబెట్టి అవగాహన తరగతులు నిర్వహించాలని ఆయా జోన్ల డీసీపీలను ఆదేశించారు. ప్రజలతో పోలీసులు ఎలా ప్రవర్తించాలి, బాధితులకు ఎలా సాయమందించాలనే విషయాలపై సిబ్బందికి వివరించాలని ఆయన సూచించారు. ఐపీఎస్ అధికారి నుంచి కానిస్టేబుల్ వరకూ వారి ప్రవర్తనలో మార్పు వచ్చినప్పుడే ప్రజల నుంచి పోలీసులకు మన్ననలు అందుతాయని కమిషనర్ భావిస్తున్నారు.  కమిషనర్ ఆదేశాల మేరకు  బాలానగర్, ఎల్బీనగర్ డీసీపీలు ఏఆర్ శ్రీనివాస్, విశ్వప్రసాద్‌లు తమ జోన్ పరిధిలో ఆదివారం పోలీసు సిబ్బందికి ఫ్రెండ్లీ పోలీసింగ్‌పై అవగాహన కల్పించారు.
     
    కార్డన్ సర్చ్..

    సైబరాబాద్‌లో శాంతి భద్రతలు, నేరాలు అదుపునకు మరోపక్క జోన్ల వారీగా ఇప్పటికే కార్డన్ సర్చ్ (బస్తీ గస్తీ)  కార్యక్రమం నిర్వహిస్తూ నేరస్తులను పసిగట్టే పనిలో పడ్డారు. గత పదిహేను రోజుల్లో బాలానగర్, మాదాపూర్ డీసీపీ జోన్ల పరిధిలో కార్డన్ సర్చ్‌లో వందలాది దొంగ వాహనాలు, పదుల సంఖ్యలో నేరస్తులు పట్టుబడిన విషయం తెలిసిందే. ఇది నేరస్తులను సైబరాబాద్ వైపు కన్నెత్తి కూడా చూడకుండా చేసేందుకు ఎంతో ఉపకరిస్తోంది.
     
    తాజాగా, ఆదివారం తెల్లవారుజామున శంషాబాద్ జోన్ పరిధిలో డీసీపీ రమేష్‌నాయుడు, క్రైమ్స్ ఇన్‌ఛార్జి డీసీపీ జి.జానకీషర్మిల నేతృత్వంలో 250 మంది పోలీసులు  పహాడీషరీఫ్‌లోని శ్రీరామ్‌కాలనీ, మైలార్‌దేవ్‌పల్లి ఠాణా పరిధిలోని లక్ష్మీగూడలో కార్డన్ సర్చ్ నిర్వహించి 44 వాహనాలను సీజ్ చేశారు. మరో ఏడుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.
     

మరిన్ని వార్తలు