ప్రాణం తీసిన గాలిపటం

15 Jan, 2020 01:23 IST|Sakshi

మేడపై నుంచి పడి బాలుడి మృతి 

జడ్చర్ల టౌన్‌: పండుగ రోజు తండ్రితో కలసి గాలిపటం ఎగరేస్తున్న ఓ బాలుడు మేడపై నుంచి కిందపడి మృతి చెందాడు. నల్లగొండ జిల్లాకు చెందిన గణేష్, నిరోష దంపతులు పదేళ్ల క్రితం మహబూబ్‌నగర్‌ జిల్లా బాదేపల్లికి వలస వచ్చి స్థిరపడ్డారు. వీరికి కుమారుడు కార్తీక్‌ (6)తో పాటు కూతురు ఉంది. సంక్రాంతి పండుగ సందర్భంగా మంగళవారం సాయంత్రం తండ్రీ కొడుకులు తమ ఇంటి పైకెక్కి గాలిపటాలు ఎగరేస్తున్నారు.

ఇదే క్రమంలో గాలిపటం పక్కింటి మేడపై ఉన్న వాటర్‌ట్యాంక్‌కు తగిలింది. దీంతో తండ్రి అక్కడికి వెళ్లి దానిని తీసుకోగా.. దారంతో లాగుతున్న కుమారుడు ప్రమాదవశాత్తు మేడపై నుంచి కింద పడ్డాడు. బాలుడిని హుటాహుటిన బాదేపల్లి ఆస్పత్రికి తరలించినప్పటికీ.. అప్పటికే మృతి చెందినట్టు డాక్టర్లు చెప్పారు. పండుగ పూట బాలుడు మృత్యువాత పడటంతో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు.

మరిన్ని వార్తలు