ప్రేమించకపోతే కత్తెరతో పొడుస్తా..

5 May, 2015 20:09 IST|Sakshi

ఘట్‌కేసర్ (రంగారెడ్డి జిల్లా) : ప్రేమించకపోతే కత్తెరతో పొడుస్తానని బాలికను బెదిరించిన ఓ యువకుడిని పోలీసులు మంగళవారం రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...నల్లగొండ జిల్లాకు చెందిన ఓ కుటుంబం రెండేళ్ల క్రితం వలస వచ్చి ఘట్‌కేసర్ మండలంలోని అన్నోజిగూడ రాజీవ్ గృహకల్ప కాలనీలో నివాసం ఉంటోంది. ఆ కుటుంబానికి చెందిన బాలిక(15) సమీపంలోని పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. కాగా అదే కాలనీకి చెందిన సంతోష్(19) అనే యువకుడు ఆమెతో అప్పుడప్పుడు మాట్లాడేవాడు. దాన్ని అవకాశంగా తీసుకుని తనను ప్రేమించాలని ఒత్తిడి తీసుకువస్తున్నాడు. ప్రేమించకుంటే మీ అమ్మను చంపేస్తానని, యాసిడ్ పోస్తానని బెదిరించేవాడు.

అయితే ఈ విషయాలను ఆమె తల్లిదండ్రులకు చెప్పటంతో వారు కాలనీ పెద్దల సమక్షంలో యువకుడిని మందలించారు. కానీ  అతడి తీరు మాత్రం మారలేదు. ఆదివారం బాలిక ఇంట్లో ఒంటరిగా ఉండగా లోపలికి చొరబడి ఆమె చేయిపట్టుకొని.. ప్రేమిస్తున్నట్లు చెప్పకుంటే కత్తెరతో పొడిచి చంపేస్తానని బెదిరించాడు. భయంతో ఆమె కేకలు వేయటంతో చుట్టుపక్కల వారు అక్కడికి రాగా అతడు పరారయ్యాడు. సాయంత్రం తల్లిదండ్రులు వచ్చిన తర్వాత వారికి విషయం తెలపటంతో ఆ రోజు రాత్రే పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళవారం పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని, రిమాండ్‌కు తరలించారు. అతనిపై నిర్భయ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

>
మరిన్ని వార్తలు