‘కంటివెలుగు’లో బీపీ, షుగర్‌ టెస్టులు

24 Aug, 2018 14:52 IST|Sakshi
మాట్లాడుతున్న కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్, హాజరైన అధికారులు   

మహబూబ్‌నగర్‌ న్యూటౌన్‌ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమంలో బీపీ, షుగర్‌ టెస్టులు నిర్వహించాలని కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌ వైద్యశాఖ అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో మహబూబ్‌నగర్, జోగుళాంబ గద్వాల జిల్లాల వైద్య శాఖ అధికారులతో సమీక్షించారు. గ్రామాల్లో కంటివెలుగు వైద్య శిబిరాల్లో కంటి పరీక్షల నిర్వహణ వివరాలను అడిగి తెలుసుకున్నారు. వైద్య శిబిరాలకు వచ్చే ప్రజలకు బీపీ, షుగర్‌ టెస్టులు విధిగా నిర్వహించాలని సూచించారు. ఇందుకోసం జిల్లాలో 40మంది ల్యాబ్‌ టెక్నీషియన్‌లకు శిక్షణ ఇవ్వాలని, ఈ హెల్త్‌ క్యూబ్‌ డివైజ్‌లను సెప్టెంబర్‌ 1న ప్రారంభించాలని ఆదేశించారు.

రక్తపరీక్షలు చేస్తామంటే ప్రజలు వైద్య శిబిరాలకు తప్పనిసరిగా వస్తారని, క్యాంపుల నిర్వహణ, ప్రణాళికలపై వైద్య శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇందుకు సంబందించిన సాఫ్ట్‌వేర్‌ సిద్ధంగా ఉందాలేదా అని అడిగి తెలుసుకున్నారు. రెండు రిజిస్టర్‌లు నిర్వహించి పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.

హెల్త్‌ క్యూబ్‌కు సంబందించిన మెటీరియల్, బ్యానర్లు, సాఫ్ట్‌వేర్‌ శిక్షణ పూర్తి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో మహబూబ్‌నగర్‌ ఇన్‌చార్జ్‌ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ కృష్ణ, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ధనుంజయ, ఎన్‌సీడీ కోఆర్డినేటర్‌ జగన్నాథరెడ్డి, హర్షవర్ధన్, డాక్టర్‌ రాజేందర్, డీపీఎం సయ్యద్, గద్వాల పీఓ, సూపరింటెండెంట్లు, సంబందిత అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు