సోమాజిగూడ: బ్రెయిన్డెడ్ అయిన ఓ విద్యార్థిని తన అవయవాలను ఇతరులకు దానం చేసి మరికొందరికి ప్రాణదానం చేసింది. వివరాలు.. భద్రాద్రి జిల్లా కొత్తగూడెంకు చెందిన అయిలూరి శ్రీనివాస్, కవిత దంపతుల కుమార్తె అభినయ(14) కొత్తగూడెంలోని గౌతమ్ మోడల్ స్కూల్లో పదో తరగతి చదువుతోంది.ఈ నెల 5న అభినయ తన ఇంట్లో అకస్మాత్తుగా కళ్లు తిరిగి కింద పడిపోయింది. వెంటనే చికిత్స కోసం మలక్పేట్లోని యశోద ఆసుపత్రికి తీసుకెళ్లారు.
రెండు రోజుల పాటు చికిత్స నిర్వహించినా ఫలితం కనిపించలేదు. 7వ తేదీ సాయంత్రం అభినయకు బ్రెయిన్ డెడ్ అయిందని అక్కడి న్యూరో ఫిజీషియన్ నిర్ధారించాడు. జీవన్దాన్ ప్రతినిధులు అవయవ దానంపై బాలిక కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇవ్వడంతో అవయవ దానానికి వారు అంగీకరించారు. దీంతో అభినయ శరీరం నుంచి కిడ్నీలు, లివర్, కళ్లు, ఊపిరితిత్తులు సేకరించి అవసరమైన మరికొందరు రోగులకు అమర్చారు.