మరణంలోనూ.. జీవం

26 Feb, 2018 09:14 IST|Sakshi
ఊట్ల సందీప్‌ (ఫైల్‌)

బ్రెయిన్‌డెడ్‌ యువకుడి అవయవాలు దానం

దాతృత్వం చాటిన తల్లిదండ్రులు

నల్లగొండ, మిర్యాలగూడ రూరల్‌ : ఒక్కగానొక్క కుమారుడు కళ్లముందే కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుంటే.. పొంగివచ్చే దుఃఖాన్ని దిగమింగారు ఆ తల్లిదండ్రులు.. కొడుకు ఎలాగూ బతకడని.. తన కుమారుడి అవయవాలు ఇతరులకు దానంచేసి.. వారికి జీవితాన్ని ప్రసాదించాలని తలచారు. వివరాల్లోకి వెళ్తే.. మండలం పరిధిలోని గోగువారిగూడెం గ్రామానికి చెందిన ఊట్ల పూర్ణచందర్‌రావు, అరుణ దంపతులకు కొడుకు, కూతురు. కొడుకు ఊట్ల సందీప్‌(22)ఈ నెల 23న బైకుపై వస్తూ మిర్యాలగూడ వస్తుండగా అద్దంకి–నార్కట్‌పల్లి రహదారిపై ఏడుకోట్లతండా వద్ద అదుపుతప్పి బైక్‌ను డివైడర్‌కు ఢీ కొట్టాడు.

దీంతో తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స నిమితం హైదరాబాద్‌ తరలించారు. వైద్యులు పరీక్షించి బ్రెయిన్‌ డైడ్‌ అయినట్లు చెప్పారు. కుమారుడు బతకడం కష్టమని.. ఇదే సమయంలో ఆయన అవయవాలు దానం చేస్తే మరొకరికి ప్రాణదాతగా మీ కొడుకు మిగిలిపోతాడని వైద్యులు వివరించారు. దీంతో ఆ తల్లిదండ్రులు పుట్టెడు దుఃఖం దిగమింగుకుని కొడుకు అవయవాలను దానం చేసేందుకు అంగీకరించారు.

మరిన్ని వార్తలు