వరుడు అదృశ్యం.. నిలిచిన పెళ్లి..

27 May, 2015 19:03 IST|Sakshi

చెన్నూర్ (ఆదిలాబాద్ జిల్లా): మరి రెండు రోజుల్లో పెళ్లి. అంతా రెడీ. వరుడు సరుకుల కోసం వెళ్లాడు. తిరిగి రాలేదు. బుధవారం ఉదయం కావాల్సిన వివాహం ఆగిపోయింది. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలు.. ఆదిలాబాద్ జిల్లా చెన్నూర్ పట్టణంలోని బజ్జారికాలనీకి బజ్జూరి బానయ్య కుమార్తెకు కోటపల్లి మండలం రాంపూర్ గ్రామానికి చెందిన పడాల సమ్మయ్య కుమారుడు మల్లయ్యతో వివాహం నిశ్చయమైంది.

బుధవారం ఉదయం 10 గంటలకు వివాహ ముహూర్తం ఉంది. వరుడు మల్లయ్య పెళ్లి పనుల నిమిత్తం ఆదివారం చెన్నూర్‌కు వెళ్లగా.. సోమవారం ఇంటికి చేరలేదు. ఈ విషయాన్ని పెళ్లి కూతురు వాళ్లకు చెప్పకపోవడంతో వాళ్లు అన్ని ఏర్పాట్లూ చేశారు. మంగళవారం రాత్రి వరకు కూడా మల్లయ్య రాకపోవడంతో తండ్రి సమ్మయ్య చెన్నూర్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. వరుని జాడ తెలియకపోవడంతో బుధవారం 10 గంటలకు జరగాల్సిన వివాహం నిలిచిపోయింది. దీంతో అమ్మాయి కుటుంబ సభ్యులు విచారం వ్యక్తం చేస్తున్నారు. వివాహ వేడుకకు వచ్చిన వారంతా వెనుదిరిగారు. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని సీఐ శ్రీలత తెలిపారు.

మరిన్ని వార్తలు