‘నా పెళ్లికి వచ్చేవారు మోదీకి ఓటు వేయండి’

12 Feb, 2019 08:52 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాజకీయ నాయకులపై తమ అభిమానాన్ని ఒక్కొక్కరు ఒక్కో విధంగా వ్యక్తంచేస్తూ ఉంటారు. ప్రధాని నరేంద్ర మోదీకి వీరాభిమాని అయిన ఓ నవ వరుడు మాత్రం వినూత్న రీతిలో తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. ‘‘ఫిబ్రవరి 21న నా వివాహం. వివాహానికి వచ్చే వారు ఎలాంటి బహుమతులను తీసుకురావద్దు. వాటికి బదులుగా వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో మాత్రం బీజేపీకి ఓటు వేసి.. నరేంద్ర మోదీని ప్రధానిగా మరోసారి గెలిపించండి అంతే చాలు’’  అంటూ తన వివాహ పత్రికపై అచ్చువేయించాడు.

ఓట్‌ ఫర్‌ మోదీ అని బీజేపీ ఎన్నికల చిహ్నమైన కమళం గుర్తును సైతం పత్రికపై ముద్రించాడు. దీన్ని చూసిన వారంతా ఒక్కింత ఆశ్చర్యానికి గురైయ్యారు. తనకు మోదీ అంటే ఎంతో అభిమానమని, గడిచిన నాలుగున్నరేళ్లలో ఎన్నో పథకాలను ఆయన ప్రవేశపెట్టారని 27 ఏళ్ల ముఖేష్‌ రావు చెప్పుకొస్తున్నారు. మోదీ స్ఫూర్తితోనే తాను పనిచేస్తున్న ఆఫీసులో ప్రతి నెల స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. మరోసారి మోదీ అధికారంలోని రావాలని తాను కోరుకుంటున్నాననీ, ఆయన విజయానికి తన వంతుగా ఈవిధంగా కృషి చేస్తున్నాని పేర్కొన్నారు.

మోదీ నాయకత్వలోనే దేశం అభివృద్ధి చెందుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. శంషాబాద్‌కు చెందిన ముఖేష్‌ రావు టీఎస్‌ జెన్‌కోలో అసిస్టెంట్‌ ఇంజనీర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన టీఆర్‌ఎస్‌కు మద్దుతుగా నిలవడం విశేషం. ఇటీవల గుజరాత్‌లో కూడా ఓట్‌ ఫర్‌ మోదీ అంటూ ఓ జంట వివాహ పత్రికపై ముద్రించి మోదీపై తమకున్న అభిమానాన్ని చాటుకున్న విషయం తెలిసిందే. 
 

>
మరిన్ని వార్తలు