తెల్లవారితే పెళ్లి...వరుడు ఆత్మహత్య

29 Jan, 2015 22:17 IST|Sakshi

వేల్పూర్ (నిజామాబాద్): తెల్లవారితే పెళ్లి... అందరూ పెళ్లిపనుల్లో నిమగ్నమైయ్యారు.  ఇంతలో  పిడుగులాంటి వార్త..  పెళ్లి చేసుకుని కొత్తజీవితాన్ని ఆరంభించాల్సిన వరుడు ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఎన్నో ఆశలతో సంతోషంగా ఉన్న ఆ ఇంట ఒక్కసారిగా విషాదం అలుముకుంది. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం అమీనాపూర్ గ్రామంలో గురువారం జరిగింది. వివరాలు.. శేఖ్ షాబుద్దిన్, ఖాజా దంపతులకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. చిన్నవాడైన శేఖ్ హమీద్‌కు ఇటీవల నవీపేట మండలం బినోల గ్రామానికి చెందిన యువతితో పెళ్లి నిశ్చయించారు. గురువారం ఉదయం 11.30కు బినోలలో పెళ్లి జరగాల్సి ఉంది. అంతలో పెళ్లి కొడుకు హమీద్ (24) పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం ఐదు గంటలకు కుటుంబం, బంధువులు బినోల గ్రామానికి వెళ్లడానికి సిద్ధమయ్యారు.

హమీద్ కనిపించలేదు. చుట్టుపక్కల వెదికినా జాడలేదు. దీంతో అనుమానం వచ్చి తమ సొంత వ్యవసాయక్ష్రేతంలో వెదకడంతో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ కనిపించాడు. ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలోనే మర ణించాడు. హమీద్ ఏడేళ్లుగా ఉపాధి కోసం దుబాయికి వెళ్లి వస్తున్నాడు. నాటుగు నెలల కిందటే ఇంటికి రాగా, తల్లిదండ్రులు అతనికి పెళ్లి నిశ్చయించారు. అంతలోనే అతను ఆత్మహత్మకు పాల్పడ డంతో కుటుంబ సభ్యులు దుఃఖసాగరంలో మునిగిపోయారు. హమీద్ ప్రవర్తన దురుసుగా ఉండేదని, ఇదే నెలలో రెండుసార్లు ఉరి వేసుకొని ఆత్మహత్యకు యత్నించాడని కుటుంబీకులు చెప్పారు. ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు