అక్క అంత్యక్రియలకు వచ్చి తమ్ముడూ...

25 Jan, 2015 19:46 IST|Sakshi

 రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన అక్క అంత్యక్రియలకు హాజరైన తమ్ముడు మరో రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. నల్లగొండ జిల్లా మునగాల మండలం ముకుందాపురం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ముకుందాపురం గ్రామానికి చెందిన తాళ్లపాక పుల్లమ్మ(65)ను ఉదయం 6 గంటలకు కారు ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందింది. పుల్లమ్మ మృతితో ఆగ్రహించిన గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. సాయంత్రం పుల్లమ్మ అంత్యక్రియల్లో పాల్గొని తిరిగి వెళ్తున్న ఆమె తమ్ముడు నెమ్మాది బంగారయ్య(64)ను అదే ప్రాంతంలో మరో కారు ఢీకొనడంతో మృతి చెందాడు. దీంతో కోపం పట్టలేని గ్రామస్తులు మరోసారి రోడ్డుపై రెండు గంటలపాటు రాస్తారోకో చేశారు.

విషయం తెలుసుకున్న పోలీసులు, రెవిన్యూ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొన్నారు. ఆర్డీవో శ్రీనివాసరెడ్డి, సూర్యాపేట డీఎస్పీ ఎమ్.ఎ. రషీద్ గ్రామస్తులను సముదాయించారు. సర్వీస్ రోడ్లు లేకపోవడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, వెంటనే రోడ్లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పుల్లమ్మను ఢీకొన్న కారు ఆచూకి లభించలేదు. బంగారయ్యను ఢీకొన్న కారును కోదాడలో గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఒకే రోజు జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృతి చెందడంతో ముకుందాపురంలో విషాదఛాయలు అలముకున్నాయి.

మరిన్ని వార్తలు