దా‘రుణం’

21 Aug, 2015 04:03 IST|Sakshi

ఖమ్మం వ్యవసాయం : ఓ వైపు వర్షాభావ పరిస్థితులు.. మరోవైపు పంట రుణాలు అందక రైతులు నానా తంటాలు పడుతున్నారు. అందుబాటులో ఉన్న వస్తువులను తాకట్టు పెట్టి వడ్డీ వ్యాపారుల నుంచి పెట్టుబడులు తెస్తున్నారు. పంటలు వేసి రెండు నెలలకు పైగా అరుునా ఇప్పటి వరకు రుణాలు ఇవ్వడం లేదు. ఇటీవల కురిసిన వర్షాలకు పెట్టుబడులు మరింత పెరిగినా బ్యాంకర్ల నుంచి స్పందన లేదు.

 ఖరీఫ్ రుణ లక్ష్యం రూ.1716.94 కోట్లు
 ఈ ఏడాది జిల్లా రైతులకు ఖరీఫ్ రుణాలుగా రూ.1716.19 కోట్లు అందించాలని డీఎల్‌టీసీ(డిస్ట్రిక్ట్ లెవల్ టెక్నికల్ కమిటీ) నిర్ణయించింది. ఈ పంట రుణాలను ఖరీఫ్ సీజన్ ఆరంభంలో ఇస్తే రైతులకు ఉపయోగపడతాయి. ఈ రుణాల్లో ఆగస్టు మొదటి వారం వరకు కేవలం రూ.277.82 కోట్లు మాత్రమే రైతులకు ఇచ్చినట్లు రికార్డులు చెబుతునాయి. వీటిలో రుణమాఫీకి సంబంధించిన పంట రుణాలు కూడా ఉన్నాయని అధికారులంటున్నారు. రుణమాఫీ రుణాలను కొన్ని బ్యాంకులు రైతులకున్న అప్పుల కింద జమ చేసుకుంటున్నారుు. తిరిగి రుణాలు ఇవ్వటం లేదని రైతులు వాపోతున్నారు. డీఎల్‌టీసీ ఖరీఫ్‌లో రైతులకు రుణాలను ఇవ్వాలని బ్యాంకర్లను ఆదేశించినా ఆచరణకు నోచుకోవడం లేదు. కలెక్టర్ చైర్మన్‌గా ఉన్న డీఎల్‌టీసీ ఆదేశాలను కూడా బ్యాంకర్లు అంత సీరియస్‌గా తీసుకోకపోవడం గమనార్హం.

 బ్యాంకుల్లోనే నిధులు..
  రెండో విడతగా ప్రభుత్వం విడుదల చేసిన రుణమాఫీ నిధులు బ్యాంకుల్లోనే మూలుగుతున్నాయి. రుణమాఫీ కింద 25 శాతం నిధులను రెండు విడతలుగా ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తం రుణమాఫీలో 12.5 శాతం నిధులు రూ.204.56 కోట్లను జూలై 10వ తేదీన, మరో 12.5 శాతం నిధులు అంటే మరో రూ.204.56 కోట్లను ఆగస్టు ఒకటిన విడుదల చేసింది. మొదటి దఫా విడుదల చేసిన నిధులు నెల దాటగా, రెండో విడుత నిధులు విడుదలై 20 రోజులైంది. ప్రభుత్వం నుంచి రుణమాఫీ నిధులు విడుదలైనా వాటిని రైతులకు అందించటంలో మాత్రం బ్యాంకులు కాలం గడుపుతున్నాయి.

3,59,493 మంది రైతులకు చెందిన మొత్తం రెండో విడత రుణమాఫీ రూ.409 కోట్ల వరకు జిల్లాలోని బ్యాంకుల్లో మూలుగుతున్నాయి. వీటిలో కొన్ని బ్యాంకుల్లో మాత్రం రెన్యూవల్ ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ఈ సారి రుణమాఫీ ప్రక్రియకు కొత్త రాగం ఎత్తుకుంది. రుణమాఫీకి అర్హులైన రైతులందరితో బ్యాంకుల్లో ‘జీరో’ బ్యాలెన్స్ ఖాతాలను తెరిపించి.. రుణమాఫీ రుణాలను తిరిగి పంట రుణాలుగా ఆయా అకౌంట్లలో వేయాలని నిర్ణయించింది. కానీ ఇంకా ఈ ప్రక్రియ ప్రారంభం కాలేదు. ఈ ప్రక్రియ ప్రారంభం కావటానికి మరో 10 నుంచి 15 రోజుల వరకు పడుతుందని అధికారులంటున్నారు.

 వడ్డీ వ్యాపారులే దిక్కయ్యూరు..
 దేవుడు వరమిచ్చినా..పూజారి కరుణించని చందంగా రైతుల పరిస్థితి తయూరైంది. బ్యాంకుల చుట్టూ తిరిగి విసిగి వేసారిన రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రరుుస్తున్నారు. రూ.3 నుంచి రూ.5 వరకు వడ్డీకి తెస్తున్నారు. ఎరువులు, పురుగుమందులు, కూలీలకు డబ్బులు వెచ్చించాల్సిన ఈ తరుణంలో రుణాలివ్వకుంటే ఎప్పుడిస్తారని రైతులు ప్రశ్నిస్తున్నారు. బాండు పేపర్లు, బంగారం, ఇతర వస్తువులు తాకట్టుపెట్టి వడ్డీవ్యాపారుల దగ్గర నుంచి అప్పు తీసుకుంటున్నామని వాపోతున్నారు. ఇప్పటికైనా రుణాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

మరిన్ని వార్తలు