స్విమ్మింగ్‌పూల్‌లో ఈతకు దిగి..

11 May, 2018 10:49 IST|Sakshi
విశాల్‌ మృతదేహం

బోధన్‌ టౌన్‌(బోధన్‌) : స్విమ్మింగ్‌ పూల్‌లో ఈతకు వెళ్లిన యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. బోధన్‌ సీఐ వెంకటేశ్వర్లు కథనం ప్రకారం.. ఎడపల్లి మండలం మంగళ్‌పాడ్‌ చౌరస్తాకు చెందిన విశాల్‌ (21) బీటెక్‌ పూర్తి చేశాడు. తన మిత్రులతో కలిసి ఈత కొట్టడానికి బోధన్‌లోని ఆఫీసర్స్‌ క్లబ్‌లో గల స్విమ్మింగ్‌పూల్‌కు గత రెండు నెలల నుంచి వస్తున్నాడు. రోజూ లాగే గురువారం మధ్యాహ్నం సమయంలో తన స్నేహితులతో కలిసి స్విమ్మింగ్‌పూల్‌కు వచ్చాడు. ఈత కొట్టేందుకు స్విమ్మింగ్‌ పూల్‌లోకి దిగిన విశాల్‌.. ఎంతకూ పైకి రాలేదు. దీంతో మిత్రులు అతడ్ని బయటకు తీసి 108 వాహనానికి సమాచారం అందించారు.

అయితే, 108 వచ్చే సరికే విశాల్‌ మృతి చెందాడు. సమాచారమందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మరోవైపు, తన కుమారుడి మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ తండ్రి తుకారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కుమారుడికి ఈత వచ్చని, ఈత వచ్చిన వ్యక్తి ఎలా మృతి చెందుతాడని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన కుమారుడికి మృతికి కారణమైన ఈతకొలను నిర్వాహకులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు. విశాల్‌ మృతికి గల కారణాలపై సీఐని వివరణ కోరగా.. పోస్టుమార్టం తర్వాత అన్ని విషయాలు తెలుస్తాయని ఆయన బదులిచ్చారు.

మరిన్ని వార్తలు