బంజారాహిల్స్‌ యాక్సిడెంట్‌; బస్సు డ్రైవర్‌దే తప్పు

3 Dec, 2019 10:30 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గత నెల 26న బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 12 ప్రధాన రహదారిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సోహినీ సక్సేనా అనే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని ఆర్టీసీ బస్సు చక్రాల కిందపడి మృతి చెందిన విషయం విదితమే. ఈ ఘటనలో తాత్కాలిక డ్రైవర్‌ శ్రీధర్‌ను అదే రోజు అరెస్టు చేశారు. ఈ ప్రమాదానికి డ్రైవర్‌ తప్పిదమే కారణమని రవాణాశాఖ సెంట్రల్‌ జోన్‌ ఏఎంవీఐ మున్నీ నిర్ధారించారు. ఆమె సోమవారం బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ప్రమాదానికి కారణమైన బస్సును తనిఖీ చేశారు. డ్రైవర్‌ అజాగ్రత్త వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుందని, బస్సు ఫిట్‌నెస్‌ బాగానే ఉందని స్పష్టం చేశారు. ఈ మేరకు నివేదిక అందజేస్తామన్నారు.

కాగా, ప్రమాదం జరిగిన తర్వాత తాత్కాలిక డ్రైవర్‌ శ్రీధర్‌పై వాహనదారులు, స్థానికులు దాడి చేశారు. ప్రమాదానికి కారణమైన బస్సును ధ్వంసం చేశారు. ఈ చర్యలకు పాల్పడిన వారిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు ప్రభుత్వం నుంచి మృతురాలి కుటుంబానికి ఎటువంటి భరోసా లభించకపోవడం పట్ల విమర్శలు వస్తున్నాయి. (స్కూటీని ఢీకొట్టి... శవాన్ని ఈడ్చుకెళ్లి..)


ప్రమాదానికి కారణమైన బస్సు   

మరిన్ని వార్తలు