వాళ్లిద్దరు అబద్దాలకు బ్రాండ్‌ అంబాసిడర్‌లుగా మారారు

7 Sep, 2019 16:42 IST|Sakshi

బివి శ్రీనివాస్‌

సాక్షి, హైదరాబాద్‌ : ఆల్‌ ఇండియా యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు బివి శ్రీనివాస్‌కు గాంధీభవన్‌లో గ్రేటర్‌ యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అనిల్‌కుమార్‌ యాదవ్‌, కాంగ్రెస్‌ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా బివి శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. మోదీ, కేసీఆర్‌లు అబద్దాలకు బ్రాండ్‌ అంబాసిడర్‌లుగా మారారని విమర్శించారు. ఈడీని అడ్డం పెట్టుకొని కాంగ్రెస్‌ నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. పార్లెజి కంపెనీ మూసేయడంతో వేలమంది ఉద్యోగస్తులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయని, ఇందుకు ఉదాహరణగా హర్యానాలో 640 కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ కథ ముగిసిపోయిన అధ్యాయమని అన్న వారందరికి మా తడాకా చూసిస్తామని , పార్టీలో సరిగా పనిచేయని వారిపై వేటు వేసి కొత్తవారిని తీసుకుంటామని తెలిపారు. సామాన్య కుటుంబంలో పుట్టి ఎటువంటి రాజకీయ అనుభవం లేని కుటుంబం నుంచి వచ్చిన శ్రీనివాస్‌ ఈ స్థాయికి చేరుకోవడం ఆనందంగా ఉందని అనిల్‌కుమార్‌ యాదవ్‌ వెల్లడించారు. సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఇస్తానన్న ఉద్యోగాలు, నిరుద్యోగ భృత్తి ఏమైందని ప్రశ్నించారు. 

మరిన్ని వార్తలు