సీ విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదులు
అనుమతులు లేని ప్రచారంపై కేసు నమోదు
జనగామ జిల్లాలో ఇప్పటివరకు 56 ఫిర్యాదులు
ఒక చోట కేసు నమోదు ఉల్లంఘనకు పాల్పడితే శిక్షలు
సాక్షి, జనగామ: ముందస్తు ఎన్నికలపై ఎలక్షన్ కమిషన్ అనేక ఆంక్షలు విధిస్తుంది. సాంకేతికతను వినియోగిస్తూ గతంలో ఎన్నడూ లేని విధంగా అభ్యర్థుల ప్రచార కదలికలపై కన్నేసింది. కోడ్ ఉల్లంఘనలపై అధికారులు పర్యవేక్షిస్తుండగా ఈసారి పనిలో పనిగా సామాన్యపౌరులకు ఆ బాధ్యతలు అప్పగించింది. దీంతో ఫిర్యాదుల వెల్లువ కొనసాగుతుంది. కోడ్ అతిక్రమిస్తున్న రాజకీయపార్టీలపై సీ విజిల్ యాప్, ఈసీ వెబ్సైట్, ఈ మెయిల్ ద్వారా ఎన్నికల సంఘం దృష్టికి తీసుకొస్తున్నారు. కోడ్ అమలులోకి వచ్చిన నాటినుంచి జనగామ జిల్లావ్యాప్తంగా సీ విజిల్ యాప్లో 56 ఫిర్యాదులు అందాయి. వీటిలో 55 కేసులకు సంబంధించి విచారణ జరుపుతుండగా ఒకటి మాత్రం ఎఫ్ఐఆర్ బుక్చేశారు.
ఓటింగ్ రోజు జాగ్రత్త
ముందే అవగాహన.. పెద్ద ఎత్తున ప్రచారం..
ఎలక్షన్ నియమావళి ఉల్లంఘనపై సీ విజిల్, వెబ్సైట్, ఈ మెయిల్ ద్వారా ఫిర్యాదుచేసే విధానంపై ఎన్నికల అధికారులు జిల్లావ్యాప్తంగా ప్రచారం చేశారు. సీ విజిల్ కోసం నియమించిన నోడల్ అధికారుల ద్వారా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నిత్యం అవగాహన కార్యక్రమాలు చేపడుతూ ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నారు.
సత్వర పరిష్కారం..
సీ విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదులు చేసిన 100 నిమిషాల్లో సమస్యను పరిష్కరించే విధంగా సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. యాప్ ద్వారా ఫిర్యాదులు చేసే వారి వివరాలు అడ్రస్ తెలుసుకుంటారు. దీంతో సంబంధిత అధికారులు ఆ ప్రాంతానికి చేరుకుని సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నారు. యాప్ ద్వారా వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి వాస్తవమయితే కేసు నమోదు చేయడంతో పాటు ఫిర్యాదుచేసిన వ్యక్తుల వివరాలు గోప్యంగా ఉంచేందుకు సంబంధిత అధికారులకు ఎలక్షన్ కమిషన్ ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేసింది.