ఆర్థిక క్రమశిక్షణ లేదు.. అడిగినా వివరణ ఇవ్వలేదు

10 Apr, 2018 02:53 IST|Sakshi

రాష్ట్ర ప్రభుత్వ పద్దుల లెక్కలపై పీఏసీకి కాగ్‌ వివరణ

సాక్షి, హైదరాబాద్‌: వివిధ సంస్థల నుంచి తీసుకున్న అప్పులను రాష్ట్ర ప్రభుత్వం ఆదాయంగా చూపించిందని పీఏసీకి కాగ్‌ నివేదించింది. సర్కారు ఆర్థిక క్రమశిక్షణ పాటించలేదని, దీనిపై అధికారులకు లేఖ రాసినా వివరణ ఇవ్వలేదని పేర్కొంది. సోమవారం శాసనసభ కమిటీహాలులో పీఏసీ సమావేశమైంది. పీఏసీ చైర్‌పర్సన్‌ గీతారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ భేటీకి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే లక్ష్మణ్, సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు భానుప్రసాదరావు, రాములునాయక్‌ హాజరయ్యారు.

పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా పీఏసీకి కాగ్‌ అధికారులు వివరణ ఇస్తూ.. ప్రభుత్వ, ప్రభుత్వరంగ ఆర్థిక సంస్థల నుంచి అప్పులు తీసుకుని, నిధులు మళ్లించి ప్రభుత్వం ఆదాయంగా చూపించిందన్నారు. హడ్కో ద్వారా తీసుకున్న అప్పును ఆర్థిక శాఖ ఆదాయంగా చూపించిందని వివరించారు. హైదరాబాద్‌ మెట్రో వాటర్‌ వర్క్స్‌ తీసుకున్న రుణాన్ని ఆదాయంగా చూపించారన్నారు. విద్య, వైద్య రంగాలకు నిధుల కేటాయింపులు, ఖర్చులు ఏటేటా తగ్గించార, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులు కేటాయించినా ఖర్చు చేయలేదన్నారు. దీంతో సమావేశానికి ఆర్థిక శాఖ అధికారులను పిలిచి సమాచారం తీసుకోవాలని పీఏసీ నిర్ణయించింది. 

మరిన్ని వార్తలు