పార్టీల అభ్యర్థుల ‘లెక్కల’ కుస్తీలు

9 Dec, 2018 13:18 IST|Sakshi
ఓటింగ్‌ తీరు తెన్నులపై ఆరా తీస్తున్న ఆయా పార్టీల అభ్యర్థులు

పోలింగ్‌ బూత్‌ల వారీగా అభ్యర్థుల లెక్కలు

పెరిగిన పోలింగ్‌ శాతంపై సొంత విశ్లేషణలు

గెలుపోటములపై అంచనాకు వస్తున్న నేతలు

ఎన్నికల ఫలితాలపై పెరుగుతున్న బెట్టింగులు

కౌంటింగ్‌ ఏర్పాట్లలో నిమగ్నమైన అధికారులు

అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత కీలకమైన పోలింగ్‌ ఘట్టం ముగియడంతో ఆయా పార్టీల అభ్యర్థులు ఓటింగ్‌ తీరు తెన్నులపై ఆరా తీస్తున్నారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ పోలింగ్‌ శాతం పెరగడంతో. ఎవరికి అనుకూలమనే కోణంలో బూత్‌ల వారీగా లెక్కలు వేసుకుంటున్నారు. బూత్‌ స్థాయి అనుచరులతో మాట్లాడుతూ.. గెలుపోటములపై అంచనాకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఎన్నికల ఫలితాలపై అన్ని వర్గాల్లోనూ ఉత్కంఠ నెలకొనగా, బెట్టింగుల పర్వం కూడా ఊపందుకుంటోంది. ఇదిలా ఉంటే జిల్లా అధికార యంత్రాంగం మాత్రం ఈ నెల 11న జరిగే ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై దృష్టి సారించింది.

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2014 సాధారణ ఎన్నికలతో పోలిస్తే ఓటింగ్‌ శాతం గణనీయంగా పెరిగింది. ఏకంగా 8.1శాతం ఓట్లు అదనంగా పోల్‌ అవడంతో, పెరిగిన పోలింగ్‌ శాతం ఎవరికి అనుకూలమనే కోణంలో పార్టీలు, అభ్యర్థులు విశ్లేషణలు సాగిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం వరకు పోలి ంగ్‌ తీరుతెన్నులపై ఆరా తీస్తూ, అనుచరగణానికి ఆదేశాలు జారీ చేయడంలో అభ్యర్థులు తీరిక లేకుండా గడిపారు. శుక్రవారం రాత్రికి పో లింగ్‌ బూత్‌లు, మండలాల వారీగా ఓటింగ్‌ వివరాలు చేతికి అందడంతో అభ్యర్థులు.. బూత్‌ల వారీ విశ్లేషణలపై దృష్టి సారించారు. బూత్‌ల వా రీగా పోలైన ఓట్ల సంఖ్య, అందులో తమకు అనుకూలంగా పడే ఓట్ల సంఖ్యను విశ్లేషించుకుంటూ కీలక అనుచరులతో శనివారం తెల్లవారుజాము వరకు కసరత్తు చేశారు. తమకు పడే ఓట్ల సం ఖ్యపై ఓ అంచనాకు వచ్చిన ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో గెలుపు ధీమా కనిపిస్తోంది. పక్షం రోజులు గా ఎన్నికల ప్రచారంలో తీరిక లేకుండా గడిపిన నేతలు శనివారం విశ్రాంతికి ప్రాధాన్యత ఇస్తూనే, తమను కలిసేందుకు వచ్చిన అనుచరులతో పోలింగ్‌ వివరాలపై ఆరా తీశారు. ఓట్ల లెక్కింపునకు మరో రెండు రోజులు ఉండడంతో అభ్యర్థులు కుటుంబ సభ్యులతో గడిపేందుకు ప్రాధాన్యత ఇస్తూనే, ఫలితాలపై లెక్కలు వేసుకుంటున్నారు.


జోరుగా సాగుతున్న బెట్టింగులు
పోలింగ్‌ ఘట్టం ముగియడంతో శుక్రవారం సాయంత్రం మీడియాలో వచ్చిన ఎగ్జిట్‌ పోల్‌ ఫలి తాలపై నాయకులు, సామాన్యులనే తేడా లేకుం డా చర్చల్లో మునిగి తేలుతున్నారు. పోలీసులు, పాత్రికేయులు, ఎన్నికల విధుల్లో పాల్గొన్న వారి నుంచి వివరాల సేకరణకు అభ్యర్థులతో పాటు, వివిధ రంగాలకు చెందిన వారు ఆసక్తి చూపుతున్నారు. రాజకీయాలపై ఆసక్తి ఉన్న వారు ఫలితా లపై ఎవరికి వారుగా విశ్లేషణలు చేస్తూ, బెట్టింగులకు దిగుతున్నారు. ఇందులో విదేశీ పర్యటనలు, హోటళ్లలో విందులు, నగదు తదితర కోణాల్లో బెట్టింగులు జరుగుతున్నాయి. నియోజకవర్గాల వారీగా స్థానిక పరిస్థితులు, వివిధ వర్గాలు ఓ టింగ్‌ వేసిన తీరు, ఇతర ప్రాంతాల నుంచి సొంత గ్రామాలకు తరలివచ్చి ఓటేసిన వారు.. ఇలా రకరకాల కోణాల్లో ఫలితం ఎలా ఉంటుందనే కోణంలో అన్ని వర్గాల్లోనూ ఉత్కంఠ నెలకొంది.


ఓట్ల లెక్కింపు ఏర్పాట్లలో నిమగ్నం
శుక్రవారం రాత్రి డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాలకు ఈవీఎంలు చేరుకోగా, శనివారం పటిష్ట బందోబస్తు నడుమ కౌంటింగ్‌ కేంద్రాలకు తరలించారు. పటాన్‌చెరు మండలం రుద్రారంలోని గీతం యూనివర్సిటీ ప్రాంగణంలో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన స్ట్రాంగ్‌ రూంలు ఏర్పాటు చేశారు. ఒక్కో నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఐదు కౌంటింగ్‌ హాళ్లను సిద్ధం చేశారు. ఒక్కో లెక్కింపు కేంద్రంలో 14 టేబుళ్ల చొప్పున ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్‌ ఎం.హనుమంతరావు ‘సాక్షి’కి వెల్లడించారు. ఓట్ల లెక్కింపులో పాల్గొనే సిబ్బందికి ఆదివారం గీతం యూనివర్సిటీ ప్రాంగణంలో తులి దశ శిక్షణకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను మంగళవారం ఉదయం 8 నుంచి 12 గంటల మధ్య పూర్తి చేసేలా ఏర్పాట్లు చేశారు. 
 

మరిన్ని వార్తలు