ఓటుకు నోటు కేసులో బాబుకు శిక్ష తప్పదు..

22 Nov, 2018 13:49 IST|Sakshi
మాట్లాడుతున్న కెప్టెన్‌ లక్ష్మీకాంతారావు

అసెంబ్లీ ఎన్నికల్లో సెంచరీ కొడుతాం

రాజ్యసభ సభ్యుడు కెప్టెన్‌ లక్ష్మీకాంతారావు 

సాక్షి, భీమదేవరపల్లి(హుస్నాబాద్‌): ఓటుకు నోటు కేసులో సీఎం చంద్రబాబుకు, రేవంత్‌రెడ్డికి జైలు శిక్ష తప్పదని టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు కెప్టెన్‌ లక్ష్మీకాంతారావు అన్నారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్క నూర్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఆనాడు ఎన్టీఆర్‌ స్థాపించిన తెలుగుదేశం పార్టీని చంద్రబాబు భ్రష్టు పట్టించినట్లు తెలిపారు. మహాకూటమి పేరుతో టీడీపీ కాంగ్రెస్‌తో జతకట్టడాన్ని చూస్తుంటే ప్రజలు అసహ్యించుకుంటున్నట్లు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా ఉన్న టీడీపీతో కాంగ్రెస్‌ పార్టీ, తెలంగాణ జనసమితి పొత్తును అపవిత్ర కూటమిగా ఆయన అభివర్ణించారు.

మహాకూటమి పేరుతో వస్తున్న ఆయా పార్టీలు మరోమారు తెలంగాణను భక్షించేందుకు సిద్ధమైనట్లు తెలిపారు. హుస్నాబాద్‌ నియోజకవర్గం నుంచి మహాకూటమి అభ్యర్థిగా బరిలోకి దిగిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి తన సొంత గ్రామానికి తాగు నీరందించలేదన్నారు. ఆయన ఇక నియోజకవర్గానికి ఏం పనిచేస్తాడని ప్రశ్నించారు. రాబోయే ఎన్నికల్లో మహాకూటమి అభ్యర్థులను చిత్తుగా ఓడించి టీఆర్‌ఎస్‌కు పట్టం కట్టాలన్నారు. సమావేశంలో జెడ్పీ మాజీ ఉపాధ్యక్షుడు డాక్టర్‌ సుధీర్‌కుమార్, టీఆర్‌ఎస్‌ నాయకులు వంగ రవి, మాలోతు రాంచందర్‌ నాయక్, ఎస్డీ షరీఫోద్దిన్, ఏనుగు సత్యవతి, జిల్లెల గాల్‌రెడ్డి, మాడ్గుల అశోక్, బొల్లంపల్లి రమేష్‌ ఉన్నారు.

మరిన్ని వార్తలు