కారు బీభత్సం..ఇద్దరికి గాయాలు

28 Dec, 2014 23:49 IST|Sakshi
కారు బీభత్సం..ఇద్దరికి గాయాలు

లంగర్‌హౌస్: యువకుడు నిర్లక్ష్యంగా కారు నడిపి బీభత్సం సృష్టించాడు. ఈ ఘటనలో ఇద్దరు అయ్యప్ప మాలధారులకు తీవ్ర గాయాలయ్యాయి. లంగర్‌హౌస్ పోలీసుల కథనం ప్రకారం..విశాఖపట్నానికి చెందిన కృష్ణారెడ్డి(24), ఏడుకొండలురెడ్డి(28) రాజేంద్రనగర్ మండలం హైదర్షాకోట్‌లో నివాసముంటున్నారు. ఇటీవల అయ్యప్ప మాల వేసుకుని అత్తాపూర్‌లోని సన్నిధానంలో ఉంటున్నారు.

ఆదివారం ఉదయం 8 గంటలకు బైక్‌పై బాపూఘాట్ మీ దుగా లంగర్‌హౌస్‌కు వెళుతున్నారు. అదే సమయం లో బషీర్‌బాగ్‌కు చెందిన గుల్జార్ అగర్వాల్(24) కారులో పోలీస్ అకాడమీ నుంచి లంగర్‌హౌస్ వైపు వేగంగా వచ్చాడు. అతడి కారు ఒక్కసారిగా గుండ్రంగా తిరుగుతూ కృష్ణారెడ్డి ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది.

రోడ్డు పక్కకు దూసుకెళ్లి టైర్లలో గాలి పెట్టించుకుంటున్న మరో కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో గుల్జార్ స్వల్ప గాయాలతో బయటపడగా,  కృష్ణారెడ్డి, ఏడుకొండలరెడ్డి తీవ్ర గాయాలపాలయ్యారు.  రెండు కార్లు, ద్విచక్ర వాహనం పూర్తిగా ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న లంగర్‌హౌస్ 108 ఈఎంటీ రఘుపతి, ఫైలట్ ముజాఫర్‌లు సంఘటన స్థలానికి చేరుకొని గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం కృష్ణారెడ్డి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఇంత జరిగినా గుల్జార్, అతడి సంబందీకులు స్థానికులు, బాధితుల పై దాడికి పాల్పడటం అందరిని నిశ్చేష్టులను చేసింది.

మరిన్ని వార్తలు