పెట్రోల్‌ బంక్‌లో కారు దగ్ధం

1 Jan, 2020 03:47 IST|Sakshi

హైదరాబాద్‌: బంక్‌లో పెట్రోల్‌ పోయించుకుంటున్న ఓ కారులో అకస్మాత్తుగా మంటలు లేచాయి. కళ్లెదుటే మంటలు చెలరేగడంతో అక్క డున్నవారు రోడ్డుపైకి పరుగులు తీశారు. హైదరాబాద్‌ షేక్‌పేటలో ఈ ఘటన చోటుచేసుకుంది. షేక్‌పేట్‌ నాలా వద్ద గల ఇండియన్‌ ఆయిల్‌ పెట్రోల్‌ బంక్‌కు మంగళవారం మధ్యాహ్నం కారు యజమాని సతీశ్‌, అతని స్నేహితుడు బషీర్‌లు పెట్రోల్‌ పోయించుకోవడానికి వచ్చారు. బషీర్‌ కారులోంచి దిగి పెట్రోల్‌ పోయించుకుంటుండగా కారు పెట్రోల్‌ పోయించుకున్నాడు. సతీష్‌ కూడా పెట్రోల్‌ డబ్బులు ఇవ్వడానికి కారు దిగారు. అంతలేనే కారు ట్యాంక్‌ కింది నుంచి భగ్గున  మంటలు రావడాన్ని గమనించారు.  

కారు పూర్తిగా మంటల్లో చిక్కుకుపోయింది. అప్రమత్తమైన పెట్రోల్‌ బంక్‌ సిబ్బంది ఫైర్‌ సర్వీస్‌కు సమచారం ఇచ్చారు. రెండు ఫైరింజన్లు హుటాహుటీన అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. అప్పటికే కారు పూర్తిగా అగ్నికి ఆహుతి అయింది. కారుతో పాటు పెట్రోల్‌ పోసే యంత్రం కూడా పూర్తిగా కాలిపోయింది. విజయవాడకు చెందిన సతీష్‌ కోదాడలోని ఓ ప్రయివేట్‌ డిగ్రీ కళాశాలలో వైస్‌ ప్రిన్సిపల్‌గా పని చేస్తున్నాడు. కారు నుంచి లీక్‌ అవుతున్న పెట్రోల్‌ కారణంగానే మంటలు లేచాయని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ సంఘటనలో రూ.25 లక్షల నష్టం వాటిల్లినట్లు అనుమానిస్తున్నారు.

మరిన్ని వార్తలు