పెళ్లింట ఊహించని విషాదం

21 Nov, 2017 19:56 IST|Sakshi

సాక్షి, తిమ్మాపూర్: కుమారుడి పెళ్లి శుభలేఖలు పంచిపెట్టి తిరిగివస్తున్న దంపతులు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన విషాదకర ఘటన కరీంనగర్ జిల్లాలో మంగళవారం చోటుచేసుకుంది. తిమ్మాపూర్ మండలం అలుగునూరు వద్ద రాజీవ్ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు ఢీ కొన్న ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. ముగ్గురు అక్కడికక్కడే కారులో ఇరుక్కుపోయి మృతి చెందగా, మరొకరు ఆసుపత్రిలో ప్రాణాలు వదిలారు.

ప్రమాదంలో మృతి చెందిన రవీందర్ రావు, సరితాబాయి దంపతులు రామగుండం మండలం కుందనపల్లి సమీపంలోని స్వగృహ కాలనీ వాసులు. వీరి కుమారుడి వివాహం ఈ నెల 29న హైదరాబాద్‌లో జరగాల్సి వుంది. వీరు తమ అక్కా, బావతో కలిసి పెళ్లి కార్డులు పంపిణీ చేసి తిరిగివస్తుండగా ప్రమాదం జరిగింది. కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను వెలికి తీయడానికి పోలీసులు శ్రమించాల్సి వచ్చింది. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వార్తలు