పాములతో జర భద్రం

19 Jul, 2014 01:07 IST|Sakshi
పాములతో జర భద్రం

- కాటు కాలం.. జాగ్రత్త
- నాటు వైద్యాన్ని నమ్మొద్దు
- వర్షాకాలంలో అప్రమత్తంగా ఉండాలి

ఆలేరు : వర్షాకాలం వచ్చిందంటే పాముల బెడద అధికంగా ఉంటుంది. వర్షాలకు పాములు బయటకు వస్తాయి. రాత్రి పూట ఇళ్లలోకి ప్రవేశిస్తాయి.  ఖరీఫ్ సీజన్‌లో సాగుకు సిద్ధమవుతున్న సమయంలో పాములు బయటకు రావటంసహజం. ప్రతి ఏటా పాము కాటుకు గురై మనుషులతో పాటు మూగజీవాలు మృత్యువాతపడుతున్నాయి. ఈ నేపథ్యంలో అన్నదాతలు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.  
 
పాముల విషప్రభావం
కట్లపాము కాటేసిన క్షణాల్లో విషం రక్తకణాల్లో కలుస్తుంది. ప్రమాద తీవ్రతను దృష్టిలో ఉంచుకుని వెంట నే ఆస్పత్రిలో చేర్చాలి. నాగుపాము కాటేసిన 15 నిమిషాల్లో శరీరంలోకి విషం ఎక్కుతుంది. రక్తపింజర కాటేసిన రెండు గంటల తరువాత విషం శరీరంలోకి ఎక్కుతుంది.అలాగే జెర్రిపోతు,నీరుకట్ట కాటేసిన విషం ఉండదు. అయితే కాటువేసిన చోట చికిత్స చేయించడానికి ఆస్పత్రికి తీసుకెళ్లాలి.
 
మంత్రగాళ్లను ఆశ్రయించొద్దు
పాము కాటుకు వైద్యం ఉంది. పాము కాటుకు గురైన వారు మంత్రగాళ్లను ఆశ్రయించొద్దు.విషంతో ఉన్న పాము కాటేసినపుడు ఆస్పత్రికి తీసుకెళ్లకుండా నాటు వైద్యులను ఆశ్రయిస్తే వారు మిడిమిడి పరిజ్ఞానంతో చేసే వైద్యం కారణంగా బాధితులు ప్రాణాలు కోల్పోతారు. ఇదేమంటే ఆలస్యం చేశారని వారు మీ మీదనే తోసేస్తారు. విషంలేని పాముకాటుకు గురైన వారు ప్రాణాలతో బయట పడినా అది మంత్రగాళ్ల మహిమే అని నమ్ముతారు. ఇదే బాధితుల పాలిట ముప్పుగా మారుతోంది.సకాలంలో వైద్యం అందక మృత్యువాతపడుతున్నారు. సరైన సమయంలో వైద్యులను సంప్రదిస్తే కుట్టిన పామును బట్టి చికిత్స చేస్తారు.

మరిన్ని వార్తలు