మెక్‌డొనాల్డ్స్‌లో ఉడకని చికెన్‌

24 Jun, 2019 08:39 IST|Sakshi

పోలీసులకు ఫిర్యాదు  

బంజారాహిల్స్‌: బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 1/10 చౌరస్తాలో ఉన్న సిటీ సెంటర్‌ మాల్‌లో మెక్‌ డొనాల్డ్స్‌ ఆహార కేంద్రంలో ఉడకని చికెన్‌ వడ్డించారంటూ బాధితులు ఆదివారం బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌–1లో ఉన్న సిటీ సెంటర్‌ మాల్‌లోకి శివశంకర్‌ అనే జర్నలిస్ట్‌తో పాటు ఆయన స్నేహితుడు శ్రీనివాస్‌ శనివారం రాత్రి షాపింగ్‌కు వెళ్లారు. అనంతరం మెక్‌డొనాల్డ్స్‌లో చికెన్‌ వింగ్స్‌ తినడానికి ఆర్డర్‌ చేశారు. ఆ తరువాత దానిని తింటుండగా సరిగ్గా ఉడకలేదని శివశంకర్‌ గుర్తించారు.

ఇదే విషయాన్ని బాధితుడు నిర్వాహకుల్ని నిలదీశాడు. కొన్నిసార్లు ఇలా జరుగుతుంటుందని నిర్లక్ష్యంగా వ్యవహరించారు. మేనేజర్‌ వచ్చి ఇంకో ఆర్డర్‌ తీసుకోవాలని చెప్పి వెళ్లిపోయారు. ఈ చికెన్‌ హర్యానా, పంజాబ్‌ నుంచి సగం ఉడకబెట్టి వస్తుందని, ఇక్కడికి వచ్చాక మళ్లీ మిగతా సగాన్ని ఆర్డర్‌ ఇచ్చిన తర్వాత ఉడకబెట్టి  ఇస్తుంటామని, ఇందులో చిన్న పొరపాటు జరుగుతుందని సర్దిచెప్పారు. అయితే.. తిన్న వెంటనే పచ్చి చికెన్‌ తిన్న ఫీలింగ్‌ రావడం, బయటికి వచ్చి వాంతులు చేసుకోవడం జరిగింది. రాత్రంతా వీరు అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం ఉదయం బంజారాహిల్స్‌ పోలీసులకు ఘటనపై ఫిర్యాదు చేసి న్యాయం చేయాలని కోరారు.

మరిన్ని వార్తలు