కేటరింగ్ బాయ్ TO సీబీఐ ఎస్సై వరకు..

4 Aug, 2014 03:53 IST|Sakshi
కేటరింగ్ బాయ్ TO సీబీఐ ఎస్సై వరకు..

నార్నూర్ :  ఇంద్రవెల్లి మండలం ముత్నూర్ గ్రామానికి చెం దిన చాటే విఠల్, లక్ష్మీబాయి దంపతులది వ్యవసాయ కుటుంబం. వీరు ఆరేళ్ల క్రితం నార్నూర్ మండల కేంద్రానికి వలస వచ్చారు. వీరికి ముగ్గురు కుమారులు, కూతు రు ఉన్నారు. వీరిలో పెద్ద కుమారుడు సంతోష్, రెండో కుమారుడు కృష్ణ. సంతోష్ వ్యాపారం నిర్వహిస్తూ కు టుంబాన్ని పోషిస్తున్నాడు. ఇక కృష్ణకు చిన్నప్పటి నుంచి చదువంటే ఎంతో ఇష్టం. తమ్ముడి ఆసక్తిని గమనించిన సంతోష్ పట్టుదలతో చదివించి, ఎల్లవేళలా ప్రోత్సహిం చాడు.

కృష్ణ ఒకటి నుంచి ఏడో తరగతి వరకు ముత్నూర్ ప్రభుత్వ పాఠశాలలో, 8 నుంచి 10వ తరగతి వరకు ఇంద్రవెల్లి ప్రభుత్వ పాఠశాలలో చదివాడు. పదో తరగతిలో 518 మార్కులు సాధించి మండలంలో ప్రథమ స్థానంలో నిలిచాడు. నిర్మల్ ఎన్‌బీఆర్ జూని యర్ కళాశాలలో ఇంటర్ చదివి 948 మార్కులు సాధిం చి కళాశాల టాపర్‌గా నిలిచాడు. అతడి ప్రతిభను గుర్తిం చిన హైదరాబాద్‌లోని శ్రీ చైతన్య కళాశాలల యాజమాన్యం ఒక సంవత్సరం ఉచితంగా ఎంసెట్‌లో కోచింగ్ ఇచ్చింది. ఎంసెట్‌లో ఉత్తమ ర్యాంకుతో హైదరాబాద్‌లోని సీవీఆర్ కళాశాలలో ఇంజినీరింగ్‌లో చేరాడు.

 చదువు.. పని..
 ఇంజినీరింగ్ చదువుతూనే సొంత ఖర్చుల నిమిత్తం కేటరింగ్ పనికి వెళ్లేవాడు. పగలు కళాశాలకెళ్లి.. రాత్రి కేటరింగ్ బాయ్‌గా పనిచేసేవాడు. కేటరింగ్ ద్వారా రోజు రూ.150 సంపాదించేవాడు. ఆ డబ్బుతో చదువు, సాధారణ ఖర్చులకు ఇబ్బంది ఉండేదికాదు. ఇలా.. చదివి బీటెక్ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు. తార్నాకలోని వంజారి సంఘం హాస్టల్‌లో ఉంటూ సినీ హీరో శ్రీకాంత్ కుమారులకు హోం ట్యూషన్ చెబుతూ ఏడాదిపాటు పోటీ పరీక్షలకు సొంతంగా ప్రిపేర్ అయ్యాడు.

2012లో ఎస్‌ఎస్‌సీ(స్టాఫ్ సెలెక్షన్ కమిషన్) డిగ్రీ అర్హతతో ప్రకటన వెలువడడంతో ఎలాగైనా ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో ప్రిపేర్ అయ్యాడు. దేశవ్యాప్తంగా మొదటి దశకు పది లక్షల మంది హాజరవగా రెండో దశకు 1.12 లక్షల మంది అర్హత సాధించారు. ఆ తర్వాత ఇంటర్వ్యూకు ఐదు వేల మంది ఎంపికయ్యారు. తెలుగు మీడియం అయినప్పటికీ కృష్ణ ఇంగ్లిష్‌లో జరిగిన ఇంటర్వ్యూలో సునాయాసంగా విజయం సాధించాడు.

దేశవ్యాప్తంగా 34 మంది సీబీఐ ఎస్సైగా ఎంపికైతే వారిలో తెలంగాణ రాష్ట్రం నుంచి కృష్ణ ఒక్కడే కావడం అతడి అసాధారణ ప్రతిభకు నిదర్శనం. అంతేకాదు ఎస్‌బీఐ, ఎస్‌బీడబ్ల్యూ, ఆంధ్రాబ్యాంక్, ఆర్‌ఆర్‌బీ, ఎఫ్‌సీఐ తదితర ఉద్యోగాలను ఒకే ప్రయత్నంలో సాధించాడు.  గాజియాబాద్ (యూపీ)లోని సీబీఐ అకాడమీలో 8 నెలల శిక్షణ పూర్తి చేశాడు. సీబీఐ డెరైక్టర్ రంజిత్ సిన్హా ద్వారా బంగారు పతకం అందుకున్నాడు. ప్రస్తుతం సీబీఐ ముంబయి బ్రాంచిలో అవినీతి నిరోధక విభాగంలో సీబీఐ ఎస్సైగా పనిచేస్తున్నాడు. 

>
మరిన్ని వార్తలు