అడవిలో అలజడి  

28 Jul, 2019 02:41 IST|Sakshi

నేటి నుంచి అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు 

ఇటు మావోయిస్టులు.. అటు గ్రేహౌండ్స్‌ బలగాలు 

ఛత్తీస్‌గఢ్‌లో తాజా ఎన్ కౌంటర్‌తో కలకలం

సాక్షి ప్రతినిధి, వరంగల్‌:  తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓ వైపు మావో యిస్టుల కార్యకలాపాలు, మరోవైపు గ్రేహౌండ్స్‌ బలగాల గాలింపు చర్యలు అటవీ పల్లెల్లో అలజడి రేపుతున్నాయి. ఈనెల 28 నుంచి ఆగస్టు 3 వరకు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకొని మావోయిస్టులు ఛత్తీస్‌గఢ్‌– తెలం గాణ అంతర్రాష్ట్ర సరిహద్దులోని భద్రాచలం, ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ప్రచారం చేశారు. పోలీసులు కూడా కూంబింగ్‌ ముమ్మరం చేశారు.   

నెలన్నర రోజులుగా మావోల కదలికలు 
గోదావరి నది పరీవాహక ప్రాంతంలో కొద్ది రోజులుగా మావోల కదలికలున్నాయని పోలీసుశాఖ అప్రమత్తమైంది. ఛత్తీస్‌గఢ్‌ నుంచి మావోలు పాత వరంగల్, ఖమ్మం జిల్లాల సరిహద్దుల్లో సంచరిస్తున్నారన్న ఇంటిలిజెన్స్ వర్గాల సమాచారం మేరకు బలగాలను మోహరించాయి. ఛత్తీస్‌గఢ్‌ నుంచి తెలంగాణలో గిరిజన సమస్యలపై దృష్టి సారించిన మావోయిస్టులు.. పూర్వ వైభవం కోసం కీలక సమావేశం నిర్వహించినట్లు సమాచారం.  పక్షం రోజుల క్రితం తెలంగాణ కమిటీ కార్యదర్శి హరిభూషణ్‌ ఆధ్వర్యంలో డివిజన్, జిల్లా నాయకులు సుమారు 40 మంది ఛత్తీస్‌గఢ్‌ –తెలంగాణ రాష్ట్రాల సరిహద్దు గోదావరి పరీవాహక ప్రాంతం చర్ల, ఎదిరె(జీ) సమీప అటవీ ప్రాంతంలో సమావేశమైనట్లు ఇంటిలిజెన్స్ వర్గాలు నిర్ధారించాయి.  తెలంగాణ రాష్ట్ర కమిటీలో ఖమ్మం–కరీంనగర్‌–వరంగల్‌ జిల్లాలకు కలిపి (కె.కె.డబ్ల్యూ) ఉన్న డివిజనల్‌ కమిటీని రద్దు చేసి.. కొత్తగా 3 డివిజన్  కమిటీలు ఏర్పాటు చేసింది. తెలంగాణ  కమిటీకి కార్యదర్శిగా యాప నారాయణ అలియాస్‌ లక్మ అలియాస్‌ హరిభూషణ్‌ నియమితులయ్యారు. 

నూతన కమిటీలు.. కార్యదర్శులు 
మార్పులలో భాగంగా పూర్వ కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో కొత్తగా ఏర్పడిన జిల్లాలను కలుపుకొని ఈ కమిటీలు వేసినట్లు పోలీసువర్గాలు నిర్ధారించాయి. మంచిర్యాల–కొమురంభీం (ఎం.కె.బి.) డివిజినల్‌ కమిటీకి ఇంతకు ముందు ఆదిలాబాద్‌ జిల్లా కార్యదర్శిగా ఉన్న మైలారపు ఆదెల్లు అలియాస్‌ భాస్కర్‌కు నాయకత్వం అప్పగించారు. ఇంద్రవల్లి ఏరియా కమిటీ, మంగి ఏరియా కమిటీ, చెన్నూర్‌ – సిరిపూర్‌ ఏరియా కమిటీలు ఏర్పాటైనట్లు సమాచారం. చర్ల – శబరి ఏరి యా కమిటీ కింద మడకం కోసీ అలియాస్‌ రజిత, శారదక్క నేతృత్వంలో చర్ల లోకల్‌ ఆర్గనైజింగ్‌ స్క్వాడ్, ఉబ్బ మోహ¯Œ  అలియాస్‌ సునిల్‌ నేతృత్వంలో శబరి లోకల్‌ ఆర్గనైజిగ్‌ స్క్వాడ్‌ ను ఏర్పాటు చేసినట్లు పోలీసుశాఖ ప్రచారం చేసింది. అమర వీరుల సంస్మరణ వారోత్సవాలకు ఏర్పాట్లు చేయగా, ఇదే సమయంలో ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బస్తర్‌ జిల్లా తిరియా ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్‌తో ఆ పార్టీకి మరో ఎదురు దెబ్బ.  

మరిన్ని వార్తలు