వసతి గృహాల్లో నిఘా నేత్రం

11 Jul, 2018 10:40 IST|Sakshi
రామాయంపేటలోని గిరిజన బాలుర హాస్టల్‌(ఇన్‌సెట్‌లో) బిగించిన సీసీ కెమెరా

రామాయంపేట(మెదక్‌):  వంద మంది చేయలేని పనిని ఒక సీసీ కెమెరా చేస్తుందంటారు. రోజురోజుకు సీసీ కెమెరాల వినియోగం పెరుగుతోంది. తాజాగా జిల్లాలో  సాంఘీక సంక్షేమశాఖ అధ్వర్యలో కొనసాగుతున్న అన్ని గిరిజన హాస్టళ్లలో సీసీ కెమెరాలు బిగించారు. గిరిపుత్రులకు మంచి భోజనంతో పాటు హాజరు శాతాన్ని పెంచడం, అవినీతి, అక్రమాలను అరికట్టడానికిగాను ఈ  సీసీ కెమెరాలను  బిగించినట్లు సమాచారం.

ఒక్కో హాస్టల్‌లో సుమారుగా రూ. 50 వేల ఖర్చుతో నాలుగు కెమరాలతో పాటు ఒక మానిటర్‌ను ఏర్పాటు చేశారు.  జిల్లా పరిధిలోని ఆరు ఎస్టీ హాస్టళ్లలో, మూడు ఆశ్రమ పాఠశాలల్లో  వీటిని ఇప్పటికే ఏర్పాటు చేశారు. కెమెరాలు బిగించిన తర్వాత హాస్టళ్లలో విద్యార్థుల హాజరుశాతం పెరగడంతో పాటు హాస్టళ్ల సంక్షేమాధికారులు క్రమం తప్పకుండా విధులకు హాజరవుతున్నట్లు సమాచారం.

విద్యార్థులకు నాణ్యమైన భోజనం కూడా అందుతుంది. కెమెరా కనుసన్నల్లో సిబ్బంది జాగ్రత్తగా విధులు నిర్వర్తిస్తున్నారు. విద్యార్థులుసైతం క్రమశిక్షణతో మెదులుతున్నారని  జిల్లా పరిధిలోని ఒక హాస్టల్‌ సంక్షేమాధికారి తెలిపారు. హాస్టళ్లలోని ప్రధాన  ద్వారం, సామగ్రి ఉంచే ప్రదేశం, భోజనం, ప్రార్థన చేసే ప్రాంతంలో, వీటిని ఏర్పాటు చేశారు.

నాలుగు కెమెరాల నుంచి వచ్చే వీడియోలకు సంబంధించి సమాచారం ఒక గదిలో ఉంచిన మానిటర్‌(టీవీ సెట్టు)లో నిక్షిప్తమవుతుంది. దీంతో హాస్టళ్లకు ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చినా ఇట్టే తెలిసిపోతుంది. ఇప్పటివరకు కెమెరాలు బిగించిన గిరిజిన హాస్టళ్లు రామాయంపేట, చిన్నశంకరంపేట, మెదక్, నర్సాపూర్, శివ్వంపేట, కౌడిపల్లి, టేక్మాల్‌ (బాలికల హాస్టల్‌) ఆశ్రమ సంక్షేమ వసతి గృహం, మహమ్మదాబాద్‌( నర్సాపూర్‌)   ఆశ్రమ వసతి గృహం, కౌడిపల్లి (ఆశ్రమ వసతి గృహం). 

మరిన్ని వార్తలు