త్రుటిలో తప్పిన ప్రమాదం

3 Jun, 2020 08:38 IST|Sakshi

కరోనా రోగులపై పడిన సీలింగ్‌ఫ్యాన్‌  

గాంధీ ఆస్పత్రిలో ఘటన  

గాంధీఆస్పత్రి: కోవిడ్‌ నోడల్‌ కేంద్రమైన సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో ప్రమాదం త్రుటిలో తప్పింది. తిరుగుతున్న సీలింగ్‌ ఫ్యాన్‌ హఠాత్తుగా ఊడి బెడ్‌పై చికిత్స పొందుతున్న కరోనా రోగులపై పడింది. వివరాలు.. గాంధీఆస్పత్రి ఏడో అంతస్తులో కరోనా పాజిటివ్‌ రోగులు చికిత్స పొందుతున్నారు. మంగళవారం ఉదయం పైన తిరుగుతున్న సీలింగ్‌ ఫ్యాన్‌ హుక్‌ నుంచి ఊడి అమాంతం కిందపడింది. ఈ ఘటనలో బెడ్‌పై చికిత్స పొందుతున్న ఇరువురు రోగులకు స్వల్ప గాయాలైనట్లు తెలిసింది. కరోనా పాజిటివ్‌ రావడంతో ఇప్పటికే మానసికంగా కుంగిపోయామని, ఈ హఠాత్పరిణామంతో మరింత భయాందోళనకు గురయ్యామని పలువురు రోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆస్పత్రి పాలన యంత్రాంగం తక్షణమే తగిన చర్యలు చేపట్టాలని కోరారు. ఈ విషయమై ఆస్పత్రి సూపరింటెండెంట్‌ రాజారావును వివరణ కోరగా.. ఈ ఘటన తన దృష్టికి రాలేదని, విచారణ చేపట్టి తగిన చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు