‘తెలంగాణ వ్యాప్తంగా సంబరాలు చేస్కోండి’

19 Jun, 2019 16:59 IST|Sakshi
టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి(పాత చిత్రం)

హైదరాబాద్‌: ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ కాళేశ్వరం.. ఈ ప్రాజెక్టును ఈ నెల 21న ప్రారంభోత్సవం చేస్తున్నాం.. ప్రారంభోత్సవం రోజు గ్రామ గ్రామాన సంబరాలు చేసుకోవాలని పార్టీ తరపున పిలుపునిస్తున్నట్లు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి తెలిపారు. తెలంగాణ భవన్‌లో బుధవారం టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యవర్గ సమావేశంలో పల్లా రాజేశ్వర్‌ రెడ్డి మాట్లాడారు. ప్రతి రైతు కూడా సంబరాల్లో పాల్గొనాలని కోరారు.  రాష్ట్ర కార్యవర్గంలో ఉన్న వారిలో కొందరు ఎమ్మెల్సీ, ఎంపీ, జెడ్పీ చైర్మన్‌లు అయ్యారని, వారిని కేసీఆర్‌ కూడా అభినందించినట్లు తెలిపారు.

రాష్ట్ర కార్యవర్గ కమిటీ కూడా సీఎం కేసీఆర్‌ను అభినందించిందని వెల్లడించారు. ఏ రాష్ట్రంలో కూడా టీఆర్‌ఎస్‌ పార్టీలాగా బలమైన పార్టీలేదని వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్‌ పార్టీ ఆఫీసుల నిర్మాణాల కోసం రూ.19.20  కోట్లను పార్టీ కేటాయించిందని పేర్కొన్నారు. ఈ నెల 24న  అన్ని జిల్లా కేంద్రాల్లో భూమి పూజ నిర్వహించాలని, దసరా లోపు నిర్మాణం పూర్తి చేయాలని కోరారు. ఈ నెల 27న తెలంగాణ భవన్‌లో పార్టీ సంయుక్త సమావేశం జరుగుతుందని, ఈ సమావేశానికి ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, కార్యవర్గ సభ్యులు హాజరవుతారని వెల్లడించారు. జూలై నెలలోపు పార్టీ సభ్యత్వం పూర్తి చేస్తామన్నారు.

>
మరిన్ని వార్తలు