సిమెంట్ లారీ సీజ్ - వెయ్యి బస్తాల స్వాధీనం

14 Dec, 2015 08:32 IST|Sakshi

ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ శివారులోని ఇక్బాల్‌పూర్ మార్కెట్ చెక్‌పోస్టు వద్ద వే బిల్లులు లేకుండా అక్రమంగా రవాణా చేస్తున్న సిమెంట్ లారీని సోమవారం ఉదయం పోలీసులు పట్టుకున్నారు. మహారాష్ట్రలోని నాంధేడ్ నుంచి వే బిల్లులు లేకుండా వచ్చిన ఎంఎక్స్ 26 ఎడి 1285 నంబరు గల లారీ ఖానాపూర్‌లో సిమెంట్ అన్‌లోడ్ చేస్తుండగా పోలీసులకు ఎవరో సమాచారం ఇచ్చారు.

పోలీసులను చూసిన లారీ డ్రైవర్ లారీని స్టార్ట్ చేసి ఇక్బాల్‌పూర్‌వైపు వేగంగా తీసుకెళ్లాడు. జీపులో వెంబడించిన పోలీసులు వ్యవసాయ మార్కెట్ చెక్‌పోస్టు వద్ద లారీని పట్టుకున్నారు. లారీ క్లీనర్ పోలీసులకు చిక్కాడు. డ్రైవర్ పక్కనున్న పొలాల్లోకి పరుగు తీశాడు. అతనిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. పట్టుకున్న లారీలో వెయ్యికి పైగా సిమెంట్ బస్తాలు ఉన్నాయి. లారీని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఖానాపూర్ ఎస్‌ఐ అజయ్‌బాబు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

మరిన్ని వార్తలు