‘ఉపాధి’ ఎత్తివేసేందుకు కేంద్రం కుట్ర

27 Nov, 2014 00:26 IST|Sakshi

సిద్దిపేట అర్బన్: కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని ఎత్తి వేసేందుకు కుట్ర పన్నుతోందని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఏ. మల్లేషం పేర్కొన్నారు. ఉపాధి పథకంపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ  సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఆర్డీఓ కార్యాలయం ఎదుట బుధవారం ధర్నా చేపట్టారు.  ఈ సందర్భంగా మల్లేషం మాట్లాడుతూ ఉపాధి హామీ ద్వారా గ్రామాల్లో అనేక మంది ఉపాధి పొందుతున్నారన్నారు.

మండలాలను కుదించడం ద్వారా వలసలు, కూలీల ఆత్మహత్యలు పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం భూస్వాములకు పెత్తందారులకు తలొగ్గి ఈ పథకాన్ని ఎత్తి వేయడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. పథకంలో ఉన్న లోపాలను సవరించి పని దినాలను 200 రోజులకు పెంచాలని రూ. 250 కూలీ చెల్లించాలని డిమాండ్ చేశారు.

జిల్లాలో కేవలం ఎనిమిది మండలాలకే ఈ పథకాన్ని పరిమితం చేయడం దారుణమని, సిద్దిపేట ప్రాంతంలో ఎక్కువ మంది ప్రజలు ఉపాధి పథకంపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారని ఈ పథకాన్ని ఈ ప్రాంతంలో కొనసాగించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీఓ ముత్యంరెడ్డికి వినతి పత్రం అందజేశారు.  కార్యక్రమంలో  పార్టీ నాయకులు రేవంత్‌కుమార్, గోపాలస్వామి, కనకయ్య, ఆనంద్, నాగరాజు, భాస్కర్, స్వరూప, నాగమణి తదితరులు పాల్గొన్నారు.

 ఐకేపీ వీఓఏల వేతనాలను చెల్లించాలి
  19 సంవత్సరాలుగా పని చేస్తున్న ఐకేపీ వీఓఏలకు గతంలో పారితోషికాన్ని కేవలం రూ. 400లు మాత్రమే చెల్లించే వారని సీఐటీయూ పోరాట ఫలితంగా గత ప్రభుత్వం రూ. 2వేలు వేతనం చెల్లిస్తామని హామీ ఇచ్చిందని, అయితే ఆ వేతనాన్ని ఇప్పటి వరకు చెల్లించలేదని ,వెంటనే పెండింగ్ వేతనాలను చెల్లించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ. మల్లేషం డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఐకేపీ వీఓఏల వేతనాలను పెండింగ్‌లో ఉంచడాన్ని నిరసిస్తూ బుధవారం ఆర్డీఓ కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ఐకేపీ వీఓఏలు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు.దీక్షలకు మల్లేషం  సంఘీభావం ప్రకటిస్తూ మాట్లాడారు.

టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు వీఓఏలకు రూ. 5వేలు వేతనం చెల్లిస్తామని ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా నిర్లక్ష్యం చేస్తోందన్నారు. ప్రభుత్వం వెంటనే వారికి రూ. 10వేల వేతనాన్ని చెల్లించడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, హెల్త్ కార్డులు అందజేయాలని, అధికారుల వేధింపులను అరికట్టాలని డిమాండ్ చేశారు.  కార్యక్రమంలోసంఘం జిల్లా అధ్యక్షుడు కిష్టయ్య, వీఓఏలు లావణ్య, కిష్టారెడ్డి, లక్ష్మణ్, శంకర్, కవిత, మల్లేషం, హారిక, షాదుల్లా, సత్తిరెడ్డి, మహేష్, మంజుల, బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు