ఎన్‌హెచ్‌ 161కి కేంద్రం అనుమతులు 

3 May, 2018 02:33 IST|Sakshi

కేంద్ర మంత్రి గడ్కరీతో భేటీ అనంతరం తుమ్మల వెల్లడి 

సంగారెడ్డి–చౌటుప్పల్‌ మధ్య 157 కిలోమీటర్ల మేర నిర్మాణం 

సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో జాతీయ రహదారి 161 నిర్మాణానికి కేంద్రం అనుమతులు మంజూరు చేసింది. సంగారెడ్డి, నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్, జగదేవ్‌పూర్, భువనగిరి, చౌటుప్పల్‌ మధ్య 157 కి.మీ. మేర ఎన్‌హెచ్‌ 161 నిర్మాణానికి ఈ మేరకు అనుమతులు వచ్చాయని మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు తెలిపారు. బుధవారం ఎంపీ జితేందర్‌రెడ్డితో కలసి ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీని కలసి పలు జాతీయ రహదారులకు అనుమతుల మంజూరుపై ఆయన చర్చించారు. అలాగే చౌటుప్పల్, షాద్‌నగర్, కంది మధ్య 205 కి.మీ. జాతీయ రహదారికి సంబంధించి ఇప్పటికే డీపీఆర్‌లు సమర్పించామని, టెండర్లకు అనుమతులివ్వాలని కోరినట్లు చెప్పారు.

ఈ ప్రాజెక్టు దేశంలోని అన్ని జాతీయ రహదారులకు కలిపే యూనిక్‌ ప్రాజెక్టుగా పేరు తెచ్చుకుందని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా ఈ ప్రాజెక్టు విషయమై గతంలో కేంద్ర మంత్రిని కలిశారని వివరించారు. దీనిపై రాష్ట్ర అధికారులతో చర్చించి త్వరలోనే అనుమతులు మంజూరు చేస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చినట్లు వివరించారు. మహబూబ్‌నగర్‌–జడ్చర్ల రోడ్డును నాలుగు లైన్ల రహదారిగా మార్చడంపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని చెప్పారు. ఇక సీఆర్‌ఎస్‌ కింద తెలంగాణకు రూ.వెయ్యి కోట్ల నిధులను విడుదల చేయాలని కోరినట్టు తెలిపారు.  

‘మహా’గవర్నర్‌ విద్యాసాగర్‌రావును కలసిన తుమ్మల 
మహారాష్ట్ర గవర్నర్‌ విద్యాసాగర్‌రావును మంత్రి తుమ్మల మర్యాదపూర్వకంగా కలిశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న విద్యాసాగర్‌రావును కేజీ మార్గ్‌లోని మహారాష్ట్ర సదన్‌లో కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై ఇరువురు చర్చించుకున్నారు.  

మరిన్ని వార్తలు