రైతుకు ‘కేంద్ర’ సాయం 

17 Feb, 2019 12:12 IST|Sakshi
రైతుకు అర్హత పత్రం అందజేస్తున్న అధికారులు(ఫైల్‌)

మెదక్‌జోన్‌: దేశానికి అన్నంపెట్టే రైతన్నను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చింది.  వరస కరువుకాటకాలతో  సాగు ముందుకు సాగక ఆందోళన చెందుతున్న సన్న, చిన్నకారు రైతులకు పెట్టుబడి సాయం కింద  రూ. 6 వేల చొప్పున అందించేందుకు సన్నాహలు చేపట్టింది.  జిల్లాలో  మొత్తం రైతులు 2.20  లక్షల మంది ఉన్నారు. కాగా అందులో 29 వేల మంది రైతులకు  సంబంధించిన భూములు పలు కారణాలతో రాష్ట్ర ప్రభుత్వం పార్ట్‌బీ లో పెట్టింది.

దీంతో వారికి రైతులబంధు అందడం లేదు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సమ్మాన్‌నిధి అనే ప్రత్యేక పథకం ద్వారా ఐదెకరాల లోపు భూములు ఉన్న రైతులకు మాత్రమే సాయం అందజేయడానికి నిబంధనలు రూపొందించారు.  జిలాల్లో 5 ఎకరాల లోపుగల ఉన్న రైతులు 1.7  లక్షల మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు.    రూ. 6 వేల సాయంను  మూడు విడతల్లో  ఒక్కోవిడతకు రూ. 2 వేల చొప్పున అందించేందుకు ఏర్పాట్ల చేస్తున్నారు.

ఈ లెక్కన జిల్లాలో రూ. 64.20 కోట్లు పంపిణీ చేయనున్నారు. మొదటి విడతగా రూ 21.40 కోట్లు ఇవ్వనున్నారు.  ఈ మొదటి విడతకు సంబంధించిన రూ. 2 వేలను మార్చి 31 వరకు ఇవ్వనున్నారు. రెండో విడతకు సంబంధించిన రూ. 2 వేలను ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి జులై 31వ తేదీ వరకు, మూడో విడత ఆగస్టు నుంచి నవంబర్‌ 30వ, తేదీ వరకు  నేరుగా రైతుల అకౌంట్లో వేసేందుకు వ్యవసాయశాఖ అధికారులు  సిద్ధమయ్యారు. ఈ పంపిణీ పక్రియను వ్యవసాయశాఖకు అప్పగించింది.  రైతులు ఊరూర  సమావేశాలు నిర్వహించి బ్యాంకు అకౌంట్లు, పట్టాపాస్‌బుక్కులు, ఆధార్‌కార్డు జిరాక్స్‌కార్డులను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. 

ఐదెకరాల లోపు రైతులందరికీ.. 
కేంద్ర ప్రభుత్వం పీఎం సమ్మాన్‌నిధి పథకం ద్వారా 5 ఎకరాలలోపు రైతులందరికీ రూ. 6 చొప్పున ఇచ్చేందుకు నిర్ణయించింది.  ఇందుకు సంబంధించిన రైతుల బ్యాంక్‌ అకౌంట్లు, పట్టాపాస్‌ పుస్తకాలు, ఆధార్‌ జిరాక్స్‌లను సేకరిస్తున్నాం. మొదటి విడత సాయం మార్చి చివరికల్లా అందుతుంది. –పరశురాం, జిల్లా వ్యవసాయశాఖ అధికారి

మరిన్ని వార్తలు