4వ తేదీ నుంచి జన్‌ధన్‌ ఖాతాల్లో నగదు

3 May, 2020 01:52 IST|Sakshi

రెండో విడత రూ. 500 జమ చేయనున్న కేంద్ర ప్రభుత్వం

సాక్షి, హైదరాబాద్‌: ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం జన్‌ధన్‌ మహిళా ఖాతాదారులకు రెండో విడత ఆర్థిక సాయం రూ. 500 ఈనెల 4వ తేదీ నుంచి విడుదల చేయనుంది. నిర్దేశించిన తేదీల్లో నగదు వారి ఖాతాల్లో జమ కానున్నట్లు ఎస్‌ఎల్‌బీసీ (రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి) శనివారం ప్రకటించింది. ఖాతా నంబరు చివరి అంకె ఆధారంగా షెడ్యూల్‌ ఇచ్చామని, లబ్ధిదారులు ఆయా తేదీ ల్లో సంబంధిత బ్యాంకులు, ఏటీఎం, బ్యాంకు మిత్ర, బిజినెస్‌ కరస్పాండెంట్ల ద్వారా నగదును తీసుకోవచ్చని సూచించింది.

రాష్ట్ర ప్రభుత్వం రేషన్‌ కార్డుదారులకు ఇచ్చే రూ.1,500 ఆర్థిక సాయం కూడా వారి ఖాతాల్లో ఈనెల 2వ తేదీ నుంచి జమ కానున్నాయి. ఈ నిధులను కూడా నిర్దేశించిన షెడ్యూల్‌ ఆధారంగా భౌతిక దూరాన్ని పాటిస్తూ జాగ్రత్తలు తీసుకుంటూ నగదు ఉపసంహరణ చేసుకోవాలని ఎస్‌ఎల్‌బీసీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈనెల 12వ తేదీ తర్వాత సీరియల్‌ నంబర్‌తో సంబంధం లేకుండా అందరూ విత్‌డ్రా చేసుకోవచ్చని, జన్‌ధన్‌ అకౌంట్‌ లేదా బ్యాంకు సేవింగ్స్‌ ఖాతాలో ఒకసారి జమ అయిన నిధులను ప్రభుత్వం తిరిగి వెనక్కు తీసుకోదని స్పష్టం చేసింది. చదవండి: వడివడిగా ‘కొండపోచమ్మ’ చెంతకు 

మరిన్ని వార్తలు