చైర్మన్, చీఫ్‌ విప్‌ మధ్య వాదన

5 Jan, 2017 02:35 IST|Sakshi

పాతూరి అనుబంధ ప్రశ్నలపై స్వామిగౌడ్‌ అసహనం
సాక్షి, హైదరాబాద్‌: ప్రశ్నోత్తరాల సమయంలో అనుబంధ ప్రశ్నలు వేసి సుదీర్ఘంగా మాట్లా డటంపై బుధవారం శాసనమండలిలో చైర్మన్‌ స్వామిగౌడ్, చీఫ్‌ విప్‌ పాతూరి సుధాకరరెడ్డిల మధ్య స్వల్ప వాదన జరిగింది. ఆయుర్వేద, యునాని వైద్య విద్య ప్రోత్సహంపై మంత్రి లక్ష్మారెడ్డి సమాధానంపై పాతూరి వరసగా 5, 6 అనుబంధ ప్రశ్నలు వేసి ప్రసంగం సాగిం చారు. ప్రశ్నలు ఇంత పొడుగున ఉంటాయా, ఇన్ని అనుబంధ ప్రశ్నలు వేస్తారా అని స్వామి గౌడ్‌ ప్రశ్నించారు.

తాను ప్రశ్నలే అడుగుతు న్నానని ఆవేశానికి లోనైన సుధాకర్‌రెడ్డి స్పందించారు. మరో సందర్భంలో బీబీనగర్‌ నిమ్స్‌కు అసలు విపక్ష సభ్యులు వెళ్లారో లేదోకాని, తాను వెళ్లానని పాతూరి పేర్కొన డంతో.. ఆ విధంగా ఇతర సభ్యుల గురించి మాట్లాడటం సరికాదని చైర్మన్‌ సూచించారు. బీబీనగర్‌ నిమ్స్‌ నిర్మాణంలో వేగం పెంచాలని ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి కోరడం తో.. లక్ష్మారెడ్డి స్పందిస్తూ 9 ఏళ్ల కిందట నిర్మా ణం మొదలైందని, తాము వచ్చాక వేగవంతం చేశామని, ఇలా గతంలోనే (కాంగ్రెస్‌ అధికా రంలో ఉండగా) ఆవేశపడితే బాగుండేదని వ్యా ఖ్యానించడంతో సభలో నవ్వులు విరిశాయి.

మరోవైపు ఒకేరోజు ఒక్క మంత్రికే 7 ప్రశ్నలు వస్తే మిగతా మంత్రుల సంగతే మిటని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అడిగారు. కాగా, శాసనమండలి సభ్యులు కూడా చేనేత వస్త్రాలను ప్రోత్సహించాలని, దీనిపై ఆధారపడిన వారిని ఆదుకునేందుకు చేనేత కొనుగోళ్లు చేయాలని స్వామిగౌడ్‌ సభలో విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు