టీఆర్‌ఎస్‌లో చేరిన పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి

10 Nov, 2014 01:32 IST|Sakshi
టీఆర్‌ఎస్‌లో చేరిన పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి

సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీకి చెందిన వరంగల్ జిల్లా పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరారు. ఆదివారం ఉదయం 11గంటలకు సుమారు వెయ్యిమంది అనుచరులతో తెలంగాణ భవన్‌కు వచ్చిన ఎమ్మెల్యే ధర్మారెడ్డికి, సీఎం కేసీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కేసీఆర్ మాట్లాడుతూ,  తెలంగాణ ప్రాంతంలో రాజకీయ పునరేకీకరణ జరుగుతోందని, ధర్మారెడ్డి చేరికే ఇందుకు నిదర్శనమన్నారు.

తెలంగాణ అభివృద్ధిని కాంక్షిస్తూ రాజకీయాలకు అతీతంగా ఎంతోమంది పార్టీలో చేరడానికి ఆసక్తి చూపుతున్నారని చెప్పారు. ఎమ్మెల్యే ధర్మారెడ్డి చేరికతో టీఆర్‌ఎస్ మరింత బలోపేతమైందన్నారు. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం చేపట్టిన అన్ని కార్యక్రమాలను పూర్తి చేస్తామన్నారు. సంక్షేమ పథకాల్లో రాజీపడే ప్రసక్తే లేదన్నారు.

ఎమ్మెల్యే ధర్మారెడ్డి మాట్లాడుతూ, చంద్రబాబు మోచేతి నీళ్లు తాగుతున్న నాయకులే కేసీఆర్‌ను విమర్శిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రాంత అభివృద్ధిని కాంక్షించే తాను టీఆర్‌ఎస్ పార్టీలో చేరినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం రాజయ్యతో పాటు, పలువురు టీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు