'ఫైన్‌' పడింది!

9 Jul, 2020 13:31 IST|Sakshi
మాస్క్‌ ధరించని వ్యక్తికి జరిమానా విధిస్తున్న కేయూ ఇన్‌స్పెక్టర్‌ డేవిడ్‌రాజ్‌

మాస్క్‌ ధరించని 467 మందికి జరిమానా

వరంగల్‌ కమిషనరేట్‌ పరిధిలో విస్తృతంగా తనిఖీలు

వరంగల్‌ క్రైం: కరోనా పాజిటివ్‌ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ మేరకు మాస్క్‌ లేకుండా బయటకు రావొద్దని, అత్యవసర పనులపై బయటకు వచ్చిన సమయంలో భౌతిక దూరం పాటించాలని ప్రభుత్వం, వైద్యాధికారులు సూచిస్తున్నారు. అయినా చాలా మంది పట్టించుకోవడం లేదు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బుధవారం నుంచి వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో తనిఖీలు విస్తృతం చేశారు. ఈ మేరకు 467 మందిపై ఈ పిటీ కేసులు నమోదు చేసి జరిమానా విధించారు. ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘించి ఇష్టరాజ్యంగా బహిరంగ ప్రదేశాల్లో తిరుగుతున్న వారిపై కేసులు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. తనిఖీల్లో భాగంగా మాస్కులు ధరించని వారి వివరాలను ట్యాబ్‌ల్లో నమోదు చేసి ఆన్‌లైన్‌ ద్వారా జరిమానా విధిస్తున్నారు. కేసులు నమోదైన వ్యక్తులు కోర్టుకు వెళ్లి జరిమానాలు చెల్లించాల్సి ఉంటుంది.

మాస్క్‌లు తప్పనిసరి...
కరోనా వ్యాప్తిని నిరోధించడానికి, వ్యక్తిగతంగా ఎవరికి వారు రక్షణ కోసం తప్పక మాస్క్‌ ధరించాలి. ఈ మేరకు మాస్క్‌ లేకుండా బయటకు వచ్చిన వారిపై కేసులు నమోదు చేస్తున్నాం. ఈ విషయంలో ప్రజలు మరింత అవగాహన పెంపొందించుకోవాలి. ప్రజల శ్రేయస్సు కోసం పనిచేస్తున్న పోలీసులకు సహకరించాలి.– వి.తిరుపతి, సెంట్రల్‌ జోన్‌ ఇన్‌చార్జ్‌ డీసీపీ

మరిన్ని వార్తలు