చిల్లరగాళ్లకు చిల్లరగాడు చంద్రబాబు

14 Apr, 2019 04:48 IST|Sakshi

రాత్రిపూట నిద్రరాక పబ్లిసిటీ కోసం ఎలక్షన్‌ కమిషన్‌ దగ్గర అల్లరి 

ఏపీ సీఎంపై తలసాని మండిపాటు

సాక్షి, హైదరాబాద్‌: ‘చిల్లరగాళ్లకు చిల్లర గాడు’ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ వ్యాఖ్యానించారు. శనివారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్‌ శాతం బాగుందని, అక్కడ ప్రచారం ముగిసిన తర్వాత కూడా చంద్రబాబు ఎన్నికల కమిషన్‌ను కలసి ఒక డ్రామా సృష్టించారన్నారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా మీడియా ముందు సీఎం ప్రచారం చేశారని ఆరోపించారు. మూడు నెలల ఉపన్యాసాలతో తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ఉద యం నుంచి రాత్రి పడుకునేవరకు తలచుకున్నారన్నారు.

టెక్నాలజీతోపాటు సెల్‌ఫోన్‌ను కూడా తానే కనిపెట్టిన అని చెప్పుకునే చంద్రబాబు.. తాను ఓటు వేస్తే ఎటు పోయిందో అంటూ ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేయడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. చంద్రబాబులో ఓటమి భయం స్పష్టంగా కనబడుతోందని, నాలుగు ఓట్ల కోసం ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారన్నారు. రాష్ట్రంలో గూండాయిజం జరుగుతోందని చెప్పిన ఆయనే నర్సరావుపేట, సత్తెనపల్లి, మంగళగిరి, ఆళ్లగడ్డల్లో డ్రామాలాడించారన్నారు. సత్తెనపల్లి పోలింగ్‌ స్టేషన్లోకి వెళ్లి మరీ తలుపులు పెట్టుకుని ఎవరు ఏం చేశారో టీవీల్లో తాము చూశామని పరోక్షంగా ఏపీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు ఉదంతాన్ని ప్రస్తావించారు. ఇక్కడ ఆస్తులున్న వారిని బెదిరించారని, కొట్టారని ఎన్నికల్లో ప్రచారం చేశారన్నారు. 

పాలు, పెరుగు అమ్మితే రూ.1,600 కోట్లు వస్తాయా?
 ఏపీ పైన అంత ప్రేమ ఉంటే హైదరాబాద్‌లో ఉన్న బాబు ఆస్తులు అమ్మేసి శాశ్వతంగా ఏపీకి వెళ్లిపోవాలని తలసాని అన్నారు. పాలు, పెరుగు, కూరగాయలు అమ్ముకునే వారు రూ.1600 కోట్లు సంపాదించగలరా, హెరిటేజ్‌లో అన్ని దొంగ లెక్కలే ఉన్నాయన్నారు. చంద్రబాబు నిజాయతీ పరుడైతే ఎన్నికలకు ఖర్చు పెట్టలేదని మీ పిల్లల పైన కాణిపాకం వినాయకుని ముందు ఒట్టు వేయాలన్నారు. చంద్రబాబు అవినీతి పరుడని తమ పిల్లల పైన ఒట్టు వేస్తానన్నారు. అవినీతికి కేరాఫ్‌ అడ్రస్‌ చంద్రబాబని, ఆయన మనవడి పేరిట రూ.75 కోట్ల ఆస్తులు ఎక్కడివో చెప్పాలన్నారు. ఐదేళ్ల నుంచి అమలు చేయని అన్నదాత సుఖీభవ, పసుపు –కుంకుమ లాంటి పథకాలు ప్రజలను మభ్యపెట్టడానికి ఎన్నికల వేళ అమల్లోకి తెచ్చారన్నారు. టీడీపీకి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు , జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అని చేప్పుకోవడం సిగ్గుచేటన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో కాకుండా ఆ పార్టీకి ఎంఎల్‌ఏలు ఎక్కడ ఉన్నారన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల్లో డబ్బుల పంపిణీ ప్రారంభించిందే చంద్రబాబు అని ఆరోపించారు. కేసీఆర్‌ లాగా ఆరు నెలల ముందే టిక్కెట్లు ఇస్తానని చెప్పి నామినేషన్ల ఉపసంహరణ నాడు అభ్యర్థులను ప్రకటించారన్నారు. దుర్మార్గుల చేతిలో ఈ రాష్ట్రాన్ని పెట్టకండంటూ ఎలక్షన్‌ కోడ్‌ ఉన్న సమయంలో మాట్లాడొచ్చా అని ప్రశ్నించారు. ఎన్నికలప్పుడు తమ్ముళ్లూ అంటూ జూనియర్‌ ఆర్టిస్టులతో బస్సు ఎక్కి డ్రామా చేశారని, ఐదేళ్లలో కనక దుర్గ గుడి దగ్గరి ఫ్లై ఓవర్‌నే కట్టని దద్దమ్మ చంద్రబాబు అని అన్నారు. రూ.2 వేల నోట్ల కట్టలను ఆంధ్రప్రదేశ్‌కు తెలంగాణ సీఎం కేసీఆర్‌ పంపించారని మాట్లాడటం సరికాదన్నారు.

చంద్రబాబు ఇమేజ్‌ బురదలో పడి పొర్లుతోందని, వయసు మీదపడటంతో మతిస్థిమితం కోల్పోతున్నాడన్నారు. 18 కేసులపై కోర్టులో స్టేలు తెచ్చుకుని, తిరుగుతూ సిగ్గులేకుండా మాట్లాడుతున్నాడన్నారు. తెలంగాణలో 16 పార్లమెంటు స్థానాలను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంటుందని, సీఎం కేసీఆర్‌ పాలనాదక్షతను గుర్తించిన పేదలు, బడుగు బలహీన వర్గాల వారు టీఆర్‌ఎస్‌ పార్టీని బలపరుస్తున్నారన్నారు. సికింద్రాబాద్‌ పార్ల మెంట్‌ పరిధిలో ప్రజల స్పందన చాలా బాగుందన్నా రు. మే 23న వెలువడే ఫలితాలు ఏకపక్షంగా ఉంటా యన్నారు.టీఆర్‌ఎస్‌ పార్టీ తమకు అన్ని విధాలుగా సహకరిస్తుందని ప్రజలు భావిస్తున్నారన్నారు.

మరిన్ని వార్తలు