పట్టభద్రుల నియోజకవర్గంపై అధిష్టానం నిర్ణయం
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పో టీ చేస్తున్న గ్రూప్–1 మాజీ అధికారి మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్కు టీఆర్ఎస్ అధికారికంగా మద్దతు ప్రకటించింది. ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గాల్లో పార్టీ తరపున అధికారికంగా అభ్యర్థిని నిలబెట్టమని ప్రకటించిన టీఆర్ఎస్ అధిష్టానం.. స్థానికంగా నెలకొన్న పరిస్థితులను బేరీజు వేసుకుని వ్యూహాత్మకంగా చంద్రశేఖర్గౌడ్కు మద్దతుగా నిలిచింది.
శుక్రవారం నామినేషన్ల ఉపసంహరణ సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యేలు ఎం. సంజయ్ కుమార్ (జగిత్యాల), సుంకె రవిశంకర్ (చొప్పదండి), ఎమ్మెల్సీ ఎన్.లక్ష్మణ్రావు రంగప్రవేశం చేశారు. ఇప్పటికే టీఆర్ఎస్ నేతలు, సానుభూతిపరుల దాఖలు చేసిన నామి నేషన్లను ఉపసంహరింపజేశారు. పార్టీ ఆదేశాల మేరకే చంద్రశేఖర్గౌడ్కు మద్దతుగా నిలిచినట్లు వారు చెప్పారు. ఈ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా కాంగ్రెస్ సీనియర్ నేత టి.జీవన్రెడ్డి బరిలో నిలిచారు. ఆయన ఎమ్మెల్సీ కాకుండా అడ్డుకునేందుకు చంద్రశేఖర్ గౌడ్కు అండగా నిలవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.