ఏజన్సీలో ఒక్క గొంతూ ఎండొద్దు

3 Mar, 2017 09:28 IST|Sakshi
ఏజన్సీలో ఒక్క గొంతూ ఎండొద్దు
► ఇప్పటి నుంచే అధికారులు శ్రద్ధ పెట్టాలి
► జూనియర్‌ కళాశాలలుగా రెండ్యాల, మూడు చెక్కలపల్లి, తాడ్వాయి ఆశ్రమ పాఠశాలలు
► గిరిజన సంక్షేమ అభివృద్ధి సమావేశంలో మంత్రి అజ్మీరా
► వచ్చే నెలలో పూర్తి స్థాయి ఐటీడీఏ సమావేశం
 
ఏటూరునాగారం/ఎస్‌ఎస్‌ తాడ్వాయి : 
ఏజన్సీ ప్రజలకు తాగునీటి సమస్యల తలెత్తకుండా చూడాలి.. ఒక్క గొంతూ ఎండొద్దు.. అధికారులు ఇప్పటి నుంచే ప్రత్యే శ్రద్ధ చూపాలని గిరిజన సంక్షేమశాఖ మంత్రి అజ్మీరా చందూలాల్‌ సూచించారు. తాడ్వాయి ఆశ్రమ పాఠశాలలో కలెక్టర్‌ మురళి అధ్యక్షతన గిరిజన సం క్షేమ అభివృద్ధి సమావేశం గురువారం జరగగా ఆయన మాట్లాడారు. ఈ సమావేశానికి ఐటీడీఏ పరిధిలోని గిరిజన మండలాల ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలను పిలవాలనుకున్నా నూతన జిల్లా, అధికారుల అవగాహన లోపం వల్ల పిలవలేక పోయామన్నారు.
 
ఇది ఐటీడీఏ పాలక మండలి సమావేశం కాదని గిరిజన సంక్షేమ అభివృద్ధి సమావేశం మాత్రమేనన్నారు. వచ్చే నెలలో పూర్తి స్థాయిలో పాలకమండలి సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. ఏజన్సీ గ్రామాల్లో తీవ్రంగా ఉన్న తాగునీటి సమస్యను పరిష్కరించాలని ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులను ఆదేశించారు. రెడ్యాల, మూడు చెక్కలపల్లి, తాడ్వాయి ఆశ్రమ బాలికల పాఠశాలలను ఈ జూన్‌ నుంచి జూనియర్‌ కళాశాలలుగా అప్‌గ్రేడ్‌ చేస్తున్నందున ఏర్పాట్లుచేయాలని చెప్పారు. 
 
విద్య, ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఇంజనీరింగ్‌..
మహబూబాబాద్‌ ఎంపీ సీతారాంనాయక్‌ మాట్లాడుతూ హన్మకొండ జులైవాడ హాస్టల్‌లో గోళాలపై బస్త సంచులు కప్పిన నీటిని తాగున్నారని, నేను నిధులు ఇస్తా వాటర్‌ ప్లాంట్‌ పెట్టమని చెప్పినా ఎందుకు పెట్టలేదని ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఈఈ కోటిరెడ్డిని ప్రశ్నించారు. గిరిజన పిల్లలకు అవసరమైన డ్యూయల్‌ బెడ్స్‌ ఏర్పా టు చేయించడంలో అధికారులు నిర్లక్ష్యం చూపొద్దన్నారు. గిరిజన బాలిక, బాలుర డిగ్రీ విద్యార్థుల కోసం రెసిడెన్షియల్స్‌ నిర్మించడానికి ప్రణాళికలను తయారు చేయాలన్నారు.
 
జిల్లాకు కేటాయించిన ఈజీఎస్‌ నిధులను కలెక్టర్‌ నేరుగా గ్రామపంచాయతీలకు అప్పగించడం వల్ల జెడ్పీటీసీలు ఉత్సవ విగ్రహాలుగా మిగిలా రని జెడ్పీ ఫ్లోర్‌ లీడర్‌ సకినాల శోభన్‌ అన్నారు. 10 శాతం జెడ్పీ, 15 మండల పరిషత్, 75 గ్రామ పంచాయతీలకు కేటాయించాలని ఈజీఎస్‌ చెబుతున్నా కలెక్టర్‌ మాత్రం నిధులను మొత్తం పంచాయతీలకు అప్పగించడం బాధాకరమన్నారు. మంత్రి చందూలాల్‌ కల్పించుకొని జెడ్పీటీసీలు ఇచ్చిన ప్రతిపాదనల ప్రకారం పనులకు అనుమతులు ఇచ్చి, నిధులు కేటాయించే విధంగా చూడాలన్నారు. 
వైద్య శాఖ ..
జిల్లాలో 25 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, నాలు గు సామాజిక ఆస్పత్రులు ఉన్నాయని డీఎంహెచ్‌ఓ అప్పయ్య వెల్లడించారు. కొత్తగూడ, గూడూరు, మంగపేట, ఏటూరునాగారం మం డలాల్లో సబ్‌ సెంటర్ల కోసం అనుమతులు వచ్చాయని, వాటి నిర్మాణాలు చేపట్టాలని కోరా రు. ఎనిమిది పీహెచ్‌సీలను 24/7గా అప్‌గ్రేడ్‌ చేసి నిత్యం వైద్యులు అందుబాటులో ఉంటు న్నారని చెప్పారు.
 
జిల్లాలో మూడు నెలల్లో 256 డెలివరీలు చేశామని, ఐటీడీఏ పరిధి పీహెచ్‌సీలకు ఉన్న 12 అంబులెన్స్‌లకు మూడు నెలలు గా అద్దె చెల్లించడం లేదని, గతంలోనూ చెల్లించకపోతే ఐటీడీఏ నుంచి ఇచ్చామని జేసీ అమయ్‌కుమార్‌ మంత్రికి వెల్లడించారు. ములుగు, ఏటూరునాగారం సామాజిక ఆస్పత్రికి రెండు అంబులెన్స్‌లు ఇప్పించాలని డీఎంహెచ్‌ఓ మం త్రిని కోరారు.  ఏటూరునాగారం సామాజిక ఆస్పత్రిని 50 పడకల చేర్చినా మందులు 30 పడకల వరకే వస్తున్నాయని జెడ్పీటీసీ వలియా బీ తెలపగా మిగతావి కూడా వచ్చేలా చూస్తామని డీసీహెచ్‌ఎస్‌ గోపాల్‌ వివరించారు. 
 
బెల్ట్‌షాపులను రద్దు చేయాలి 
ఏజన్సీలో గుడుంబాను, బెల్ట్‌షాపులను అరికట్టాలని  ఏటూరునాగారం ఎంపీపీ మోహరున్నీసా కోరారు. ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ శశిధర్‌ను మంత్రి పిలిచి బెల్ట్‌షాపులను ఎందుకు నియంత్రించడం లేదని ప్రశ్నించగా రాతపూర్వకంగా ఫిర్యాదులు రావడం లేదన్నారు. అయితే, మీరు చర్యలు తీసుకున్నదెప్పుదని అన్నారు. ఆ తర్వాత అటవీ ఉత్పత్తులు ఎన్ని రకాలు కొంటున్నారు.. గిరిజనులకు ఏ విధమైన ఉత్పత్తుల ఆదాయం కల్పిస్తున్నారో పది రోజుల్లో రిపోర్టు ఇవ్వాలని జీసీసీ డీఎం ప్రతాప్‌రెడ్డిని ఎంపీ ఆదేశించారు.
 
జిల్లాలో 1.57 లక్షల కుటుంబాలుండగా కేవలం 30వేల కుటుంబా లకు మాత్రమే మరుగుదొడ్లు ఉన్నాయని ఈఈ నిర్మల చెప్పగా.. అందరికీ ఎప్పుడు కట్టిస్తారని ఎంపీ ప్రశ్నించారు. 2017 సెప్టెంబర్‌  వరకు 395 గ్రామాలకు మిషన్‌ భగీరథ కింద నీటిని అందిస్తామని ఈఈ తెలిపారు. రామప్ప కింద ఉన్న గ్రామాలకు నీటిని ఎందుకు అందించడం లేదని ఈఈని ప్రశ్నించిన మంత్రి పది, పదిహేను రోజుల్లో అందించాలని ఆదేశించారు. సమావేశంలో ములుగు సబ్‌కలెక్టర్‌ గౌతమ్‌ తదితరులు పాల్గొన్నారు. 
మరిన్ని వార్తలు