గ్రామీణ పోలీస్‌ స్టేషన్లలో మార్పులు

14 Jul, 2017 02:46 IST|Sakshi
గ్రామీణ పోలీస్‌ స్టేషన్లలో మార్పులు

పోలీస్‌ కమిషనర్లు/ఎస్పీలతో డీజీపీ సుదీర్ఘ భేటీ
సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ తరహాలో ప్రతి జిల్లా పోలీస్‌ యూనిట్‌ మార్పు చెందాలని డీజీపీ అనురాగ్‌ శర్మ ఆకాంక్షించారు. పెరుగుతున్న టెక్నాలజీకి తగ్గట్టుగా పోలీస్‌ సిబ్బందితోపాటు పోలీస్‌ వ్యవస్థ కూడా అప్‌గ్రేడ్‌ కావాల్సిన అవసర ముందని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర పోలీస్‌ శాఖలో నూతన పోలీసింగ్‌ విధానం– అమ లుపై రాష్ట్రవ్యాప్తంగా ఐపీఎస్‌ అధికారులం దరితో గురువారం
సుదీర్ఘ సమావేశం నిర్వహించారు.పదేళ్లలో పోలీస్‌ శాఖ తీసు కురావాల్సిన యాక్షన్‌ ప్లాన్‌పై చర్చించారు.

జిల్లా పోలీస్‌ స్థిరీకరణ ప్రణాళిక..
ప్రతి పోలీస్‌స్టేషన్‌ అవసరాలను గుర్తించి వాటిని ఆధునిక సౌకర్యాలతో ప్రక్షాళన చేసేందుకు రాష్ట్ర పోలీస్‌ శాఖ వెస్ట్‌ జోన్‌ ఐ.జి. స్టీఫెన్‌ రవీంద్ర ఆధ్వర్యంలో జిల్లా స్థిరీకరణ ప్రణాళిక తయారు చేశారు. ప్రక్షాళనకు అవసరమైన మౌలిక వసతులపై చర్చించారు. మే నెలలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోలీస్‌ అధికారుల సమావేశం అనంతరం హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ తరహాలో ప్రతీ పోలీస్‌ స్టేషన్‌లోను అత్యాధునిక సౌకర్యాలు కల్పించాలని డీజీపీ నిర్ణయించారు. యూనిట్‌ అధికారులు జిల్లా నుంచి ఇన్‌స్పెక్టర్, ఎస్‌.ఐ.హోదా అధికా రులతో కూడిన 7 కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. ఈ కమిటీలు హైదరాబాద్‌లోని పోలీస్‌ స్టేషన్‌లను పరిశీలించడంతో పాటు స్టేషన్‌ అధికారులతో మాట్లాడడం జరిగిందన్నారు. కాగా టెక్నాలజీని, స్టేషన్‌ వాతావరణాన్ని మార్చేందుకు ప్రతీ జిల్లాలో పైలెట్‌ ప్రాజెక్ట్‌గా ఒక మోడల్‌ పోలీస్‌స్టేషన్‌ను ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.

ట్రైనీ ఐపీఎస్‌ల సందర్శన
ప్రస్తుతం సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ నేషనల్‌ పోలీస్‌ అకాడమీలో శిక్షణ పొందుతున్న 4 రాష్ట్రాలకు చెందిన 16మంది ట్రైనీ ఐపీఎస్‌ అధికారులు గురువారం డీజీపీ అనురాగ్‌ శర్మను కలిశారు. తెలంగాణలోని సాంస్కృతిక వ్యవహారాలు, పోలీసింగ్‌ విధానంపై పలు విషయాలను ఆయన్ను అడిగి తెలుసుకున్నారు.

డ్రగ్‌ ఫ్రీ సిటీగా హైదరాబాద్‌
హైదరాబాద్‌ను డ్రగ్‌ ఫ్రీ సిటీగా మార్చేందుకు చర్యలు చేపడుతున్నామని డీజీపీ అనురాగ్‌ శర్మ చెప్పారు. డ్రగ్స్‌ వ్యవహారంలో ఆబ్కారీ శాఖ చేస్తున్న దర్యాప్తునకు తమ టాస్క్‌ఫోర్స్‌తో పాటు ఇంటెలిజెన్స్‌ విభాగాలు సహకారం అందిస్తున్నాయని తెలిపారు.

మరిన్ని వార్తలు