చార్మి దాదా

27 Jul, 2017 01:04 IST|Sakshi
చార్మి దాదా

కెల్విన్‌ ఫోన్‌లో ఆ పేరుతో ఉన్న నంబర్‌ మీదేనా?
అతడితో మీరు ఫొటోలు ఎందుకు దిగారు?
వాట్సాప్, మెసెంజర్‌లో ఎందుకు టచ్‌లో ఉన్నారు?
మీరు డ్రగ్స్‌ తీసుకున్నట్టు కెల్విన్‌ చెప్పాడు.. నిజమేనా?

  చార్మిపై సిట్‌ ప్రశ్నల వర్షం.. ఆరు గంటలపాటు విచారణ
కెల్విన్‌ ఈవెంట్‌ మేనేజర్‌గానే తెలుసునన్న నటి
  పరిచయం ఉన్నంత మాత్రాన డ్రగ్స్‌ తీసుకున్నట్టా అని ప్రశ్న
  నమూనాలిచ్చేందుకు నిరాకరణ.. నేడు సిట్‌ ముందుకు ముమైత్‌


సాక్షి, హైదరాబాద్‌
కెల్విన్‌ ఫోన్‌లో చార్మి దాదా పేరుతో ఉన్న నంబర్‌ మీదేనా? పూరీతో కలసి మీరు డ్రగ్స్‌ తీసుకున్నట్టు కెల్విన్‌ చెప్పాడు.. దీనిపై ఏమంటారు.? కెల్విన్‌తో ఫొటోలు ఎందుకు దిగారు..? అంటూ సిట్‌ అధికారులు హీరోయిన్‌ చార్మికౌర్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. డ్రగ్స్‌ కేసులో భాగంగా బుధవారం చార్మి సిట్‌ ముందుకు వచ్చారు. ఉదయం 10 గంటలకు ఎక్సైజ్‌ కార్యాలయానికి చేరుకున్న ఆమెను సూపరింటెండెంట్‌ పవన్‌కుమార్‌ నేతృత్వంలోని ఇన్‌స్పెక్టర్లు బీఎల్‌ రేణుక, విజయలక్ష్మి, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రావణిలతో కూడిన మహిళా అధికారుల బృందం విచారించింది. 10.30 నుంచి సాయంత్రం 4.30 వరకు ఆరు గంటలపాటు ప్రశ్నించింది. డ్రగ్స్‌ కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్‌తో సంబంధాలపై ప్రధానంగా ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ‘‘కెల్విన్‌ కాల్‌డేటాతో పాటు వాట్సాప్‌ మెసేంజర్‌లో అనేకసార్లు చార్మి దాదా అనే పేరుతో కాల్స్, మెసేజ్‌లున్నాయి. చార్మి దాదా పేరుతో ఉన్న ఫోన్‌ నంబర్‌ మీదేనా’’అని ప్రశ్నించగా... ఆ నంబర్‌ తనదేనని చార్మి అంగీకరించారు.

అయితే తాను నిర్మిస్తున్న పలు సినిమాలకు కెల్విన్‌ ఈవెంట్‌ మేనేజర్‌గా పనిచేశాడని, అందువల్లే అతడితో వాట్సాప్‌ మెసేజ్‌లు, కాల్స్‌ ఉన్నట్టు చార్మి చెప్పినట్టు తెలిసింది. ‘మీరు పూరి జగన్నాథ్‌తో కలసి డ్రగ్స్‌ తీసుకున్నట్టు కెల్విన్‌ మా విచారణలో చెప్పాడు. దీనిపై ఏమంటారు’అని అధికారులు ప్రశ్నించగా.. తనకు డ్రగ్స్‌ తీసుకోవాల్సిన అవసరం లేదని, కెల్విన్‌తో పరిచయం ఉన్నంత మాత్రాన డ్రగ్స్‌ తీసుకున్నట్టు అనుమానించడం సరికాదని చార్మి స్పష్టంచేసినట్టు తెలుస్తోంది.

జ్యోతిలక్ష్మి సినిమా ఆడియో ఫంక్షన్‌ రోజున జరిగిన పార్టీలో కెల్విన్, పూరి, చార్మి దిగిన ఫొటోలను చూపి ఈవెంట్‌ మేనేజర్‌తో ఇలా ఫొటోలు దిగడం వెనుకున్న ఆంతర్యం ఏంటని అధికారులు ప్రశ్నించినట్టు సమాచారం. సినిమా ఫంక్షన్‌ అన్న తర్వాత పార్టీలు సర్వసాధారణమని, ఫొటోలో ఉన్నది తానేనని, ఇలా అనేకసార్లు సినిమా ఫంక్షన్లలో అభిమానులతో ఫొటోలు దిగానని చార్మి చెప్పినట్టు సమాచారం. ‘జీశాన్‌తో డ్రగ్స్‌ ఆర్డర్‌ చేసినట్టు మా వద్ద ఆధారాలున్నాయి. అసలు డ్రగ్స్‌ ఎందుకు కొనాల్సి వచ్చింది? ఎంత మందికి విక్రయించారు?’అని ప్రశ్నించగా.. తనకు డ్రగ్స్‌ విక్రయించాల్సిన అవసరం లేదని, మరెవరికీ అలవాటు చేసే పని లేదని చార్మి స్పష్టంచేసినట్టు తెలిసింది. రక్త నమూనాలు, గోర్లు, వెంట్రుకలు స్వచ్ఛందంగా ఇస్తారా అని ప్రశ్నించగా... అందుకు చార్మి నిరాకరించారని సమాచారం. తాము కూడా నమూనాలు సేకరించలేదని సిట్‌ అధికారులు ఓ ప్రకటనలో స్పష్టంచేశారు. విచారణ ప్రక్రియ మొత్తం వీడియో చిత్రీకరణ చేసినట్లు పేర్కొన్నారు.

కానిస్టేబుల్‌ ఓవర్‌యాక్షన్‌.. అధికారులకు చార్మి ఫిర్యాదు
సిట్‌ విచారణకు హాజరయ్యేందుకు ఎక్సైజ్‌ కార్యాలయానికి వచ్చిన చార్మికి చేదు అనుభవం ఎదురైంది. ఆమె విచారణకు వస్తున్నారని తెలిసి సిట్‌ అధికారులు మహిళ ఇన్‌స్పెక్టర్‌తో పాటు కొందరు మహిళ కానిస్టేబుళ్లను బందోబస్తులో పెట్టారు. అయితే చార్మి కారు దిగి లోపలికి వెళ్తున్న సందర్భంగా నల్లగొండ బెటాలియన్‌కు చెందిన కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌ అతిగా ప్రవర్తించాడు. మహిళ సిబ్బంది ఉన్నా వారిని పక్కను తప్పించి చార్మిని తాకుతూ ముందుకు తీసుకెళ్లాడు. దీంతో చార్మి షాక్‌కు గురయ్యారు. ఈ వ్యవహారంపై సిట్‌ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఎక్సైజ్‌ శాఖ విచారణకు ఆదేశించింది. సంబంధిత కానిస్టేబుల్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

ఎవరు ఆ ఇద్దరు?
ఓవైపు చార్మిని ప్రశ్నిస్తున్న సమయంలోనే సిట్‌లోని మరో బృందం డ్రగ్స్‌ కేసులో కీలకంగా ఉన్న ఇద్దరు వ్యక్తులను ప్రశ్నించింది. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ సచిన్‌ దవన్, ఓ చిన్న పరిశ్రమకు ఎండీగా ఉన్న సుయాజుద్దీన్‌ అలియాస్‌ సల్మాన్‌ అనే ఇద్దరు వ్యక్తులను 8 గంటలకు పైగా ప్రశ్నించినట్టు తెలుస్తోంది. అయితే వీరిద్దరు కెల్విన్‌ ముఠాకు చెందినవారా? లేదా సినీ పరిశ్రమలో ఎవరికైనా డ్రగ్స్‌ విక్రయించారా? అన్న దానిపై సిట్‌ వర్గాలు క్లారిటీ ఇవ్వలేదు. వీరిద్దరు ఈవెంట్‌ మేనేజర్లని, పలువురు సినీ ప్రముఖులకు డ్రగ్స్‌ సరఫరా చేసినట్టు సిట్‌ అధారాలు సేకరించినట్టు సమాచారం. ఇప్పటికే ఈ కేసులో వరుసగా ఈవెంట్‌ మేనేజర్లను సిట్‌ అధికారులు అరెస్ట్‌ చేస్తున్నారు. ప్రధాన నిందితుడిగా ఉన్న కెల్విన్‌ కూడా ఈవెంట్‌ మేనేజర్‌ కావడం గమనార్హం.

నేడు సిట్‌ ముందుకు ముమైత్‌
డ్రగ్స్‌ కేసులో ఆరోపణలెదుర్కొంటున్న సినీనటి ముమైత్‌ఖాన్‌ గురువారం సిట్‌ ఎదుట హాజరవుతారని అధికారులు తెలిపారు. మొదట్లో ఆమెకు నోటీసులిచ్చేందుకు ఎక్సైజ్‌ అధికారులు నానా తంటాలు పడాల్సి వచ్చింది. సరైన అడ్రస్‌ దొరకని కారణంగా ఆలస్యంగా నోటీసులిచ్చారు. అయితే ముమైత్‌ బిగ్‌బాస్‌ షోలో ఉండటంతో అసలు సిట్‌ ముందు విచారణకు వస్తారా? లేదా అన్న దానిపై సందిగ్ధం ఏర్పడింది. అయితే తాను సిట్‌ ఎదుట విచారణకు హాజరవుతానని, షో నుంచి అనుమతి కూడా తీసుకున్నట్టు ముమైత్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు