పెళ్లి పేరుతో మోసం, ఓయూ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ అరెస్ట్‌

21 May, 2018 08:41 IST|Sakshi

ఓయూ అధ్యాపకుడిపై కేసు

సాక్షి, తార్నాక : మ్యారేజ్‌ బ్యూరో ద్వారా పెళ్లిచూపులకు వచ్చాడు. నచ్చానని చెప్పి స్నేహం చేశాడు....పదేళ్లుగా తనతో స్నేహం చేయడమేగాక రూ.25లక్షలు తీసుకుని పెళ్లిచేసుకోకుండా మోసం చేశాడని అరోపిస్తూ ఓ యువతి ఓయూ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఓయూ ఇన్‌స్పెక్టర్‌ జగన్‌ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఓయూ కెమిస్ట్రీ విభాగంలో పరిశోధనలు చేస్తున్న యువతి ఓ యూనివర్సిటీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గానూ పని చేస్తోంది. ఉప్పల్‌కు చెందిన డాక్టర్‌ కిరణ్‌కుమార్‌ ఓయూ టెక్నాలజీ కళాశాలలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా, ఓయూ పరీక్షల విభాగంలో అదనపు కంట్రోలర్‌గా పనిచేస్తున్నాడు.

ఓ మ్యారేజ్‌ బ్యూరో ద్వారా డాక్టర్‌ కిరణ్‌కుమార్‌ సంబంధం వచ్చింది. ఇద్దరు ఇష్టపడటం తో పెళ్లి చేసుకునేందుకు నిశ్చయించుకున్నారు. పదేళ్లుగా స్నేహం కొనసాగిస్తున్న కిరణ్‌కుమార్‌ వివిధ అవసరాల పేరుతో సదరు యువతి నుంచి రూ.25లక్షలు తీసుకున్నాడు. ఇటీవల ఆమె తనను పెళ్లిచేసుకోవాలని ఒత్తిడి చేయడంతో  చేయడంతో తన అక్కల వివాహం జరిగిన తరువాత పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఆ తరువాత తనపై వేధింపులకు పాల్పడమేగాక తనను మోసం చేసి మరో యువతిని పెళ్లి చేసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు  డాక్టర్‌ కిరణ్‌కుమార్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 

నిర్భయ కేసు పెట్టాలి: బాధితురాలు... 
తనతో పదేళ్ల పాటు స్నేహం చేసి లైంగికంగా, మానసికంగా , శారీరకంగా వేధింపులకు గురిచేసిన కిరణ్‌కుమార్‌పై నిర్భయ కేసు పెట్టాలని బాధితురాలు డిమాండ్‌ చేసింది.పెళ్లి చేసుకుంటానని నమ్మించి రూ.25లక్షలు తీసుకున్నాడని, తీరా మరో యువతిని వివాహం చేసుకున్నట్లు తెలిసి నిలదీయండంతో దాడికి పాల్పడినట్లు తెలిపింది. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఉద్యోగం నుంచి తొలగించాలని కోరింది. 

మరిన్ని వార్తలు