గు‘బిల్లు’

1 May, 2019 07:41 IST|Sakshi

ఓలా, ఉబర్‌ యాప్‌ చార్జీల్లో మోసాలు క్యాబ్‌ చార్జీలతో నగరవాసుల గుండె గుభేల్‌మంటోంది.ఎవరైనా క్యాబ్‌ బుక్‌ చేసుకున్నప్పుడు ఆ ప్రయాణానికిసంబంధించిన చార్జీ సదరు ప్రయాణికుడి ఫోన్‌లోని యాప్‌లో ఒక విధంగా, డ్రైవర్‌ ఫోన్‌లోని యాప్‌లో మరో విధంగాచూపిస్తుండడం గందరగోళానికి కారణమవుతోంది. దీంతో తరచూ ప్రయాణికులు, డ్రైవర్లకు మధ్య గొడవలుఅవుతున్నాయి. 

సాక్షి, సిటీబ్యూరో: సికింద్రాబాద్‌ ఎంజీరోడ్‌ బుద్ధభవన్‌ నుంచి ఆటోనగర్‌కు వెళ్లేందుకు ఈ నెల 29న (సోమవారం) మధ్యాహ్నం 3 గంటలకు ఒక ప్రయాణికుడు ఉబర్‌ క్యాబ్‌ బుక్‌ చేసుకున్నాడు. తన మొబైల్‌ యాప్‌లో 20.13 కి.మీ. ప్రయాణానికి  రూ.344.30 చార్జీ నమోదైంది. అందుకు తన అంగీకారాన్ని తెలియజేసి క్యాబ్‌ ఎక్కేశాడు. సరిగ్గా 48.37 నిమిషాల్లో క్యాబ్‌ గమ్యస్థానం చేరుకుంది. తన మొబైల్‌లో నమోదైన చార్జీల ప్రకారం డ్రైవర్‌కు రూ.344 చెల్లించేందుకు డబ్బులిచ్చాడు. దీంతో  డ్రైవర్‌ తన మొబైల్‌ యాప్‌లో నమోదైన విధంగా రూ.1120.18 చెల్లించాల్సిందేనని స్పష్టం చేశాడు. దీంతో ప్రయాణికుడి గుండె గు‘బిల్‌’మంది. తన మొబైల్‌లో నమోదైన చార్జీలు చూపించాడు. ఆ ప్రకారమే చెల్లిస్తానన్నాడు.

అందుకు డ్రైవర్‌ ససేమిరా అన్నాడు. అలా చెల్లిస్తే  తాన అకౌంట్‌లోంచి మిగతా డబ్బులు చెల్లించాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశాడు. దీంతో  ప్రయాణికుడు ఎట్టిపరిస్థితుల్లోనూ ఎక్కువ చెల్లించబోనని తేల్చిచెప్పాడు. ఇద్దరి మధ్య కొద్ది సేపు వాగ్వాదం చోటుచేసుకుంది. మరోవైపు ఎవరికి వారు ఫోన్‌లో ఉబర్‌ కస్టమర్‌ కేర్‌ను సంప్రదించారు. ప్రయాణికుడి మొబైల్‌లో నమోదైన ప్రకారమే చెల్లించాలని సమాధానం వచ్చింది. డ్రైవర్‌కు సైతం అతని మొబైల్‌ నమోదైన చార్జీలు వసూలు చేయాలని సూచించారు. నగరంలో తరచుగా ప్రయాణికులకు ఎదురవుతున్న క్యాబ్‌ కష్టాలకు ఈ ఉదంతం నిదర్శనం. ఇది ఒక్క ఊబెర్‌ మొబైల్‌ యాప్‌కు మాత్రమే పరిమితం కావడం లేదు. ఓలా యాప్‌లోనూ ఇదే తరహా రెండు రకాల చార్జీలు నమోదవుతున్నాయి. దీంతో  డ్రైవర్, ప్రయాణికుల మధ్య తరుచుగా ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి.

ఓలా మనీ ఉందనుకుంటే,...
మరోవైపు ఓలామనీ నుంచి చెల్లించేందుకు అవకాశం ఉన్నప్పటికీ చాలా మంది డ్రైవర్లు అందుకు అంగీకరించడం లేదు. నేరుగా డబ్బులు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. దీంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓలామనీ నుంచి  తమ అకౌంట్‌లోకి డబ్బులు బదిలీ కావడం లేదని, దీంతో తాము నష్టపోవాల్సి వస్తుందని డ్రైవర్లు చెబుతున్నారు. రెండు రోజుల క్రితంఒక  ప్రయాణికురాలు ఇదే విధమైన ఇబ్బందిని  ఓలా కస్టమర్‌కేర్‌ దృష్టికి తెచ్చింది. దీనిపై ఎలాంటి సమాధానం లభించలేదని, చివరకు  డ్రైవర్‌ డిమాండ్‌ చేసిన విధంగా డబ్బులు ఇవ్వాల్సి వచ్చిందని ఆమె విస్మయం వ్యక్తం చేసింది. ఇలాంటి ఉదంతాలపై ఉబర్, ఓలా క్యాబ్‌ అగ్రిగేట్‌ సంస్థలు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నాయి. ఇలాంటి రెండు రకాల చార్జీల్లో ఎక్కువగా నష్టపోతుంది ప్రయాణికులే. చార్జీలు తక్కువగానే ఉన్నాయని క్యాబ్‌ ఎక్కిన వినియోగదారులు తీరా క్యాబ్‌ దిగిన తరువాత ఎక్కువ మొత్తంలో సమర్పించుకోవలసి వస్తోంది.

ఎందుకిలా..
క్యాబ్‌ సంస్థలు ఇలాంటి సమస్యలకు ఎలాంటి పరిష్కారాన్ని చూపడం లేదనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. సాధారణంగా ప్రయాణికులు బుక్‌ చేసుకున్న సమయంలో వాహనాల రద్దీ  తక్కువగా ఉండవచ్చు. ఆ సమయంలో తక్కువ చార్జీలు నమోదవుతాయి. రద్దీ, ప్రయాణ సమయ ం పెరిగిన కొద్దీ చార్జీల్లో  కొంత మేరకు వ్యత్యాసం ఉంటుంది. ఉదాహరణకు మొదట రూ.344 న మోదైతే ఆ తరువాత ఇది రూ.405కు పెరగొచ్చు. రద్దీ తక్కువగా ఉండి, నిర్ధారిత సమయం కంటే తక్కువ సమయంలోనే గమ్యానికి చేరుకున్నప్పుడు చార్జీలు కొంత మేరకు తగ్గేందుకు కూడా అవకాశం ఉంటుంది. కానీ అనూహ్యంగా రూ.1,120కి పైగా పెరిగే అవకాశాలు మాత్రం ఉండబోవు. ఎలాంటి మార్పులు, చేర్పులు ఉన్నా  వినియోగదారుల మొబైల్‌ యాప్‌లతో పాటు, డ్రైవర్‌ల మొబైల్‌ యాప్‌లలో కూడా నమోదు కావాలి. కానీ అలా జరగడం లేదు. సాంకేతిక కారణాల వల్లనే ఈ సమస్యలు తలెత్తుతున్నాయని క్యాబ్‌ నిర్వాహకులు చెబుతున్నారు. ఒకవేళ ప్రయాణికుల నుంచి  ఎక్కువ చార్జీలు వసూలు చే స్తే మాత్రం అనంతరం వారి ప్రయాణాల్లో తగ్గిం పు ఉంటుందని చెప్పి సమస్యల పరిష్కారాన్ని దాటవేస్తున్నారు.

రద్దీ లేకున్నా చార్జీలు ఎక్కువే..
ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి రాత్రి 8 గంటల వరకు రద్దీ వేళలుగా పరిగణిస్తారు. ఈ సమయాల్లో క్యాబ్‌ చార్జీలు అనూహ్యంగా పెరుగుతాయి. ఒక్కోసారి సాధారణ చార్జీలు రెట్టింపవుతాయి. కానీ రద్దీ లేని పగటి వేళల్లోనూ తరుచు గా ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నట్లు  ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. పగటిపూట, రాత్రి  9 తరువాత కూడా ఎక్కువ చార్జీలు న మోదవుతున్నాయని పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు