బావిలో చిరుత.. నిచ్చెన ద్వారా జంప్‌

8 Jun, 2019 14:59 IST|Sakshi

సాక్షి, ఖానాపూర్‌: నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం రాజురా గ్రామ సమీపంలోని వ్యవసాయ బావిలో ఒక చిరుతపులి పడింది. బావిలోని నీటిలో అటు-ఇటు తిరుగుతూ.. దిక్కుతోచనిస్థితిలో బిక్కుబిక్కుమంటూ ఉన్న చిరుతను గ్రామస్తులు గుర్తించారు. బావి నీటిలో ప్రాణాపాయస్థితిలో ఉన్న చిరుత గురించి పోలీసులకు, అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న అధికారులు బావిలోని చిరుతను బయటకు తెచ్చేందుకు ఓ నిచ్చెనను ఏర్పాటటు చేశారు. నిచ్చెనను గుర్తించి.. అతికష్టం మీద ఎగబాకుతూ బయటకు వచ్చిన చిరుత..  బతుకు జీవుడా అంటూ అక్కడి నుంచి సమీప అడవిలోకి పరుగు తీసింది. బావిలో చిరుత పడ్డ సమాచారం తెలియడంతో దానిని చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల పెద్ద ఎత్తున ప్రజలు బావి వద్ద గుమిగూడారు. మొత్తానికి చిరుత బావి నుంచి బయటపడటంతో గ్రామస్తులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
 

మరిన్ని వార్తలు